అభివృద్ధి ప్రదాత, సంపదను పెంచి పేదలకు పంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఆలేరు ప్రజానీకం ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఆలేరు మండలంలోని కొల్లూరులో శనివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అపర భగీరథుడై తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. 2014కు ముందు ఆలేరులో 3,637 ఎకరాలు సాగులో ఉంటే, ప్రస్తుతం 10,679 ఎకరాలు సాగులోకి వచ్చిందని తెలిపారు. ఎటుచూసినా పంటలు, జలకళతో చెరువులు కనిపిస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధిని స్వాగతించలేక బీజేపీ, కాంగ్రెస్ కపట నాటకాలకు తెర తీస్తున్నాయని మండిపడ్డారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న పార్టీలు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు, దళితబంధు వంటి పథకాలు ఎందుకు అమలు చేయలేదో జనం నిలదీయాలని కోరారు. మోదీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని, కర్ణాటక ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.
ఆలేరు రూరల్, మే 13 : అభివృద్ధి ప్రదాత, సంపదను పెంచి పేదలకు పంచే సీఎం కేసీఆర్ వెంటే ఆలేరు ప్రజానీకం ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆలేరు మండలంలోని కొల్లూరులో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ క్లస్టర్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు దొంగ నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. చౌకబారు ఆరోపణలు చేస్తూ సిగ్గు లేకుండా తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు రైతుబంధు, బీమా, 24 గంటల కరెంటు, దళితబంధు పథకాలు ఎందుకు అమలు చేయలేదో ప్రశ్నించాలన్నారు. ఎక్కడిక్కడ వారి ఆరోపణలను తిప్పికొట్టి ప్రభుత్వ సంక్షేమాన్ని వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రధాని మోదీ కబంధ హస్తం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఉచిత పథకాలు వద్దని చెప్పిన మోదీ కర్ణాటకలో ఇచ్చిన ఉచిత హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందన్నారు. వ్యవసాయం దండగా నుంచి పండుగలా చేశామని ఇందుకు సీఎం కేసీఆర్ దీక్షా దక్షత కారణమని పేర్కొన్నారు. 2014 కంటే ముందు ఆలేరులో 3,637ఎకరాలు సాగైతే ప్రస్తుతం 10,679ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ఆలేరులో ఎటుచూసినా పచ్చని పంటలు, జలకళతో చెరువులు దర్శనమిస్తున్నాయన్నారు. 9ఏళ్ల కాలంలో లక్ష మందికి ఉద్యోగాలు, ప్రతి నియోజకవర్గంలో మూడు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని తెలిపారు. పార్టీలో పాత, కొత్త అన్న తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వచ్చే 6నెలల్లో ఎన్నికలు రానున్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ రచ్చ రాంనర్సయ్య, ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జి మామిడాల అంజయ్య, వైస్ ఎంపీపీ గాజుల లావణ్యావెంకటేశ్యాదవ్, ఎంపీటీసీ జూకంటి అనురాధాఅనిల్, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి కోటగిరి ఆంజనేయులు, పీఏసీఎస్ డైరక్టర్లు గవ్వల నర్సింహులు, భిక్షపతి, సర్పంచులు కోటగిరి జయమ్మ, బండ పద్మాపర్వతాలు, వడ్ల నవ్య, పారుపల్లి లావణ్య, లక్ష్మి, బీఆర్ఎస్ వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు జనగాం వెంకటపాపిరెడ్డి, సుంచు మహేందర్, బండ మహేందర్, అంగడి భిక్షపతి, ఇలగందుల వెంకటేశ్, వెంటిక మధు, బాకి శ్రీను, మాజీ ఎంపీపీ క్యాసగల్ల అనసూయ, వైస్ ఎంపీపీ కోరుకొప్పుల కిష్టయ్య, నాయకులు కోటగిరి శ్రీధర్, గాజుల చంద్రయ్య, వెంకటేశ్యాదవ్, రెగోల్ల లింగం, మల్లికార్జున్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఒక్కతాటికి తెచ్చేందుకు చేపట్టిన కొల్లూరు క్లస్టర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అంబరాన్నంటింది. గ్రామంలో ప్రధాన రహదారి నుంచి సమ్మేళన వేదిక వరకు భారీ ర్యాలీ తీశారు. బాణాసంచాలు కాల్చివేత, డప్పుచప్పులతో ర్యాలీ సాగింది. ఆలేరు మండలంలోని 10గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాలొన్నారు.
కాంగ్రెస్, బీజేపీకి విజనూ లేదు.. సంకల్పం లేదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి విమర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. ఒక్కవైపు గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడమే గాక రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్నేనని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నదన్నారు. ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సాధించామో ఆ కల సాకారమైందన్నారు. తాగు, సాగు నీటి సమస్య తీరిందన్నారు. మండుటెండల్లో సైతం చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎదుగుదల చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదన్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తమై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా గొంగిడి సునీతమ్మను 50వేల మెజార్టీతో గెలిపించాలన్నారు.