సూర్యాపేట, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ పార్లమెంట్కు జరుగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోరు కనిపిస్తున్నది. బీజేపీ నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారి టిక్కెట్ తెచ్చుకున్నాడు తప్ప ఆ పార్టీ స్థానిక నాయకత్వం నుంచి ఏ మాత్రం సహకారం లేదు. సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో బీజేపీ జెండాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. హుజూర్నగర్తో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తన వెంట వస్తారనుకున్న సైదిరెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి చాతుర్యంతో ఒక్కరు కూడా వెళ్లలేదు.
కాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడ, సూర్యాపేటలో చేపట్టిన బస్సుయాత్రతో గులాబీ పార్టీకి క్రేజ్ పెరిగింది. సాగు, తాగు నీరు రాకపోవడం, విద్యుత్ కోతలు, రైతుబంధు కట్, రుణమాఫీ చేయకపోవడం తదితర కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై కేసీఆర్ వివరించడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్కు జనం మద్దతు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల బలం ఉండగా ప్రచారంలో ఆ రెండు పార్టీల జెండాలే దర్శనమిస్తున్నాయి. బీజేపీ అయితే ఏకాకి అయినట్లు కనిపిస్తున్నది.
సూర్యాపేట జిల్లా పరిధిలోని బీజేపీ పాత కేడర్ నుంచి అభ్యర్థి శానంపూడికి ఆశించిన స్థాయిలో కాదు అసలు సహకారమే లేదని చెప్పవచ్చు. జిల్లా బీజేపీలో తొంభై శాతం సైదిరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిత్వాన్ని మార్చాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు ప్రచారం కూడా జరిగిన విషయం విదితమే. ఇక పార్టీ మారిన తరువాత సైదిరెడ్డి హుజూర్నగర్తోపాటు ఇతర నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల కోసం రెండు మూడు వారాలపాటు ఎన్ని ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది.
కొద్ది రోజులుగా కలిసి వచ్చే కొద్దిమందితో గుళ్లు, గోపురాలు తిరుగుతూ నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు ఆ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఒకటి రెండు సార్లు సమావేశాలు, ఉన్న ఒకరిద్దరితో ఒకటి, రెండు గ్రామాల్లో పర్యటించి వెళ్తున్నారు. ఇటీవల నల్లగొండలో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహిస్తే నాగార్జునసాగర్ ఇన్చార్జి కంకణాల నివేదితారెడ్డి మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల ఇన్చార్జిలు హాజరుకాలేదు.
కాగా సైదిరెడ్డికి టిక్కెట్ వచ్చిన తరువాత ఇప్పటి వరకు కూడా బీజేపీ సీనియర్ నాయకులు సంకినేని వెంకటేశ్వర్రావు, గొంగిడి మనోహర్రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణతోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లా నాయకులు పత్తాలేరు. సంకినేని వెంకటేశ్వర్రావుకు అసెంబ్లీ ఎన్నికల్లో 40వేల ఓట్లు రాగా ఈ సారి ఆ ఊపే కనిపించడం లేదు. సీనియర్లు మొత్తం అసంతృప్తితో ఉండగా పార్టీ అధిష్టానం కూడా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దాంతో అభ్యర్థి సైదిరెడ్డి ఓ పదిమందిని వెంటేసుకొని పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం అయిన హుజూర్నగర్లో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కరూ కూడా ఆయన వెంట లేరు. అంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు.