యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల లెక్క తేలింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది ఓటర్లు అనే వివరాలను రిటర్నింగ్ అధికారి హన్మంతు కె.జెండగే వెల్లడించారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,08,585 ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 8,98,416మంది పురుషులు, 9,10,090 మంది స్త్రీలు, 79 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 3,39,341మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత మునుగోడులో 2,57,557, భువనగిరిలో 2,20,596, నకిరేకల్లో 2,53,785, తుంగతుర్తిలో 2,59,265, ఆలేరులో 2,35,270, జనగాంలో 2,42,771 ఓటర్లు ఉన్నారు.
40 ఏండ్లలోపు 9,29,325 ఓటర్లు
పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఓటర్లలో సగం మందికి పైగా యువ ఓటర్లే ఉన్నారు. 40 ఏండ్లలోపు 9,29,325 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇక 40 నుంచి 99 ఏండ్లలోపు 8,79,090 మంది ఓటర్లు ఉన్నారు. ఇక వందేండ్లకు పైగా 180 మంది ఉన్నారు. ఇందులో వంద నుంచి 109 ఏండ్ల మధ్య 143 మంది, 110 నుంచి 119 మధ్య 14 మంది, 120కి పైగా 23 మంది వృద్ధులు ఉన్నారు. వృద్ధుల ఓటు నమోదు కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.