బొడ్రాయిబజార్, మే 24 : సూర్యాపేట వేదికగా గురువారం నుంచి ఈ నెల 27వరకు రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్ షిప్ బాస్కెట్బాల్ పోటీలకు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాస్కెట్బాల్ కోర్టు సిద్ధమైంది. క్రీడలకు ప్రాధాన్యమిస్తూ జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తారనే పేరు గడించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మూడ్రోజులపాటు జరిగే చాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం అందించనున్నారు. వసతి, భోజన సౌకర్యాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది క్రీడాకారులు, 36 జట్లు పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అందుకు అనుగుణంగా సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని బాస్కెట్బాల్ కోర్టును సిద్ధం చేయించారు. అండర్-16 విభాగంలో జరిగే ఈ పోటీలకు బాలబాలికలతో సహా మొత్తం ప్రతినిధులు 600 మంది హాజరుకానుండగా వారికి ఇబ్బందులు కలుగకుండా మంత్రి జగదీశ్రెడ్డి ఏర్పాట్లు చేయించారు. ఇప్పటికే నాలుగు రోజులుగా బాస్కెట్బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తూ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు సూర్యాపేట జిల్లా జట్టును ఎంపిక చేశారు. బుధవారం సీఎం కప్ పోటీలు ముగియగానే గురువారం బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం కానుండడంతో క్రీడా సందడి కనిపిస్తున్నది.