పెన్పహాడ్, అక్టోబర్ 22 : కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ అన్నారు. ఈ యాప్ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర (MSP ) సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్, భూమి రికార్డుల ద్వారా సులభంగా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలున్నట్లు వెల్లడించారు. ఆధార్ నంబర్తో స్వీయ-నమోదుతో పాటు మార్కెట్లో రద్దీని తగ్గించడానికి, క్యూలను నివారించడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా అమ్మకాలు జరుపుకోవడంతో పాటు పేమెంట్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా లావాదేవీలలో పారదర్శకతను అందిస్తుందన్నారు.ముందుగా ప్లే స్టోర్ నుండి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లో ఆధార్, భూమి రికార్డులు (పట్టాదారు పాస్బుక్), పంట రకం, విస్తీర్ణం, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలన్నారు. పత్తి అమ్మాలనుకుంటున్న మార్కెట్ను ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ్మబోయిన రామారావు. సైదులు, వెంకన్న, సోమయ్య, శ్రీను పాల్గొన్నారు.