మిర్యాలగూడ, డిసెంబర్ 20 : 67వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బాలురు, బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జట్లు విజేతగా నిలిచాయి. ఈ నెల 18 నుంచి మిర్యాలగూడలో జరుగుతున్న బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం ముగిశాయి. విజేతలకు మిర్యాలగూడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు మాట్లాడుతూ గ్రూప్ ఈవెంట్స్లో బాలురు, బాలికల విభాగంలో నల్లగొండ జిల్లా జట్లు బంగారు పతకాలు, ఇండివిజువల్ ఈవెంట్స్లో వి.శశాంక్ బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. జి.చందన, పి.వెంకటసాయి, వైష్ణవి జాతీయస్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టి.ప్రశాంత్, ఎంబీఏ గౌరవ అధ్యక్షుడు జి.అంజయ్య, అధ్యక్షుడు నవీన్, జిల్లా కోచ్ రామకృష్ణ పాల్గొన్నారు.