నందికొండ, సెప్టెంబర్ 22 : నందికొండలోని ఇండ్లను 59 జీఓ ప్రకారం క్రమబద్ధీకరణ చేసేందుకు సర్వే న్విహించాలని అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్రావు సూచించారు. నందికొండ హిల్కాలనీ విజయవిహార్లో గురువారం రెవెన్యూ, ఎన్నెస్పీ, మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించి క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇండ్లకు సంబంధించిన జాబితా, ఎంతమంది 59 జీఓ కింద అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు, ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఎంతమంది అనే విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జీఓ 58లో 2014 కంటే ముందు నుంచి ఇండ్లలో ఎవరైతే ఉంటున్నారో వారిని అర్హులుగా గుర్తించి సర్వే చేశారని, ప్రస్తుతం 59 జీఓ ప్రకారం సర్వే చేయాల్సిన నిబంధనలపై చర్చించారు. ఇండ్ల జాబితా రూపొందించిన తర్వాతనే అధికారులు సర్వే చేయాలని సూచించినట్లు సమాచారం. ఇదే విషయమై శుక్రవారం తిరిగి నిర్వహించే సమావేశానికి అదనపు కలెక్టర్లతో పాటు కలెక్టర్ కూడా హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో తాసీల్దార్ సైదులు గౌడ్, నందికొండ మున్సిపాలిటీ కమిషనర్ రవీందర్రెడ్డి ఎన్నెస్పీ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.