మిర్యాలగూడ , జనవరి 29 : వారం పాటు తీర్థయాత్రలకు వెళ్లిన వారు మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఉండగా రోడ్డుప్రమాదంలో మృత్యుబారిన పడ్డారు. మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి – నార్కట్పల్లి బైపాస్ రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందగా, సోమవారం మరో మహిళ దవాఖానలో కన్నుమూసింది. దాంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబం అంగీకారంతో ఆరుగురి నేత్రాలను లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో సేకరించి హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు.
మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్కు చెందిన దేవులపల్లి నాగభూషణం – పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతి(30)కి నందిపహాడ్కు చెందిన చెరుపల్లి మహేశ్(32)తో వివాహం చేశారు. చిన్న కుమార్తె మాధవి (24)ని వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామానికి చెందిన మశ్చేందర్ (29)కు ఇచ్చి వివాహం జరిపించారు. మహేశ్, జ్యోతికి ఒక కుమార్తె రిషిత (6) ఉండగా.. మశ్చేందర్, మాధవి దంపతులకు కుమారుడు లియాన్స్ (2) ఉన్నారు. కాగా, వీరు ఈ నెల 26న మహేశ్కు చెందిన షిఫ్ట్ కారులో విజయవాడ పెనుగంచిప్రోలు, మచిలీపట్నం సమీపంలోని మోపిదేవి శనీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో కోటప్పకొండ వద్ద ఉన్న ఆలయంలో పూజలు నిర్వహించి మిర్యాలగూడకు బయల్దేరారు. మిర్యాలగూడకు వచ్చే ముందు జ్యోతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము హోటల్లో భోజనం చేసి ఆదివారం రాత్రి 11గంటల్లోపు వస్తామని చెప్పింది. అనంతరం దామరచర్ల మండలం రాళ్లవాగుతండా సమీపంలో ఉన్న దాబాలో భోజనం చేసి ఇంటికి బయల్దేరారు. రెండు నిమిషాల్లో తమ ఇంటికి చేరుకుంటామనేలోగా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని కృష్ణ కాలనీ సమీపంలోకి రాగానే కారు పక్క నుంచి లారీ వేగంగా వెళ్తుండడంతో అదుపు చేసేందుకు కుడి వైపునకు తిప్పాడు.
దీంతో కారు అదుపుతప్పి డివైడర్కు తగిలి రోడ్డు అవతలి వైపునకు ఎగిరి బోల్తా పడింది. ఇదే సమయంలో అటు నుంచి వచ్చిన పొట్టు లారీ కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న చెరుపల్లి మహేశ్, జ్యోతి, రిషిత, మశ్చేందర్, లియాన్స్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటగిరి, సీఐ నర్సింహారావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి ఐదుగురి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మాధవిని అంబులెన్స్లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్క డ చికిత్స పొందుతూ మాధవి మృతిచెందింది. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు అల్లుళ్లు, ఒక మనుమడు, మనుమరాలు చనిపోవడంతో దేవులపల్లి నాగభూషణం – పద్మ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మహేశ్, జ్యోతి, రిషిత మృతదేహాలకు నందిపహాడ్ గ్రామంలో.. మశ్చేందర్, మాధవి, లియాన్స్ మృతదేహాలకు వారి స్వగ్రామం వలిగొండ మండలం గొల్నేపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మశ్చేందర్ చౌటుప్పల్ మండలంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబీకులను సోమవారం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి సహాయం అందేవిధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఒక ప్రకటనలో మృతులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్ బైపాస్, చింతపల్లి బైపాస్, ఏడుకోట్లతండా, ఈదులగూడ జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఫోన్లో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందిపహాడ్ బైపాస్, చింతపల్లి రహదారికి అండర్పాస్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ను ఎన్నికల ముందు కోరినట్లు తెలిపారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బైపాస్ రోడ్ల అండర్పాస్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని కోరారు.