యాదాద్రి భువనగిరి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 16 వరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో సమ్మేళనాలపై రోడ్మ్యాప్ రూపొందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏ రోజు ఏ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలో రోడ్మ్యాప్ రూపొందించినట్లు తెలిపారు. 10 గ్రామాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 27న భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్లో జరిగే కార్యక్రమంతో ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమవుతాయని, ఈ సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో 28 నుంచి సమ్మేళనాలు మొదలవుతాయన్నారు. భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 15, ఆలేరు నియోజకవర్గంలో 17 సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమాలను వివరించేందుకే..
ప్రజలకు మరింత చేరువ కావాలని, కార్యకర్తలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఇందులో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేడర్కు వివరించనున్నట్లు, నాడు, నేడు జరిగిన మార్పులపై చర్చలు, విశ్లేషణలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోజంతా జరుగుతాయని చెప్పారు. వచ్చే నెలలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో భోజన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనాల కోసం కేడర్ పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైఎస్ చైర్మన్ చింతల కిష్టయ్య పాల్గొన్నారు.