చెన్నైలో స్టాలిన్.. ఎడప్పాడిలో పళని..
కోయంబత్తూర్లో కమల్ హాసన్
చెన్నై, మార్చి 15: తమిళనాడులో నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. సేలం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఎడప్పాడిలో పళని నామినేషన్ వేశారు. ఇదే స్థానం నుంచి ఆయన ఇప్పటి వరకు నాలుగుసార్లు గెలిచారు. చెన్నైలోని కొలత్తూరులో డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. 2011 నుంచి ఇదే స్థానం నుంచి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కమల్ హాసన్… కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు.
కన్నూర్: కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్… కన్నూర్ జిల్లాలోని ధర్మడం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మాస్కు, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి కన్నూరు కలెక్టరేట్కు చేరుకున్న 76 ఏండ్ల విజయన్… ఎల్డీఎఫ్ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల పత్రాలను సమర్పించారు. ధర్మడం నుంచి విజయన్ పోటీ చేస్తుండటం ఇది రెండోసారి. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం ఆరోసారి.