హైదరాబాద్ : మెదక్ జిల్లాలో నిన్న ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. మహిళపై పశువుల వ్యాపారి సాజిద్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాకీ డబ్బులు అడిగినందుకు మహిళపై సాజిద్ యాసిడ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. 80 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన చక్రీబాయి భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. రోజూ సంపాదించిన డబ్బులు కూడబెట్టుకొని అర ఎకరం భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నది. ఆదివారం జోగిపేట మార్కెట్కు వెళ్లివస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం మండల పరిధిలోని గడిపెద్దాపూర్ గ్రామంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద సాజిద్ ఆమె ముఖంపై యాసిడ్ దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చక్రీబాయిని 108లో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానకు తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.