చిన్న వయసులోనే వెండితెరకు పరిచయమైనా.. ఆ తర్వాత బుల్లితెరకే పరిమితమయ్యారు భావన సామంతుల. ప్రస్తుతం ‘శుభస్య శీఘ్రం’ సీరియల్తో జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారామె. ఎన్నో సీరియల్స్లో.. లోతైన పాత్రలతో అందరికీ సుపరిచితురాలైన భావన తనను తాను బంధాల మనిషిగా చెప్పుకొంటారు. ఆ ముచ్చట్లు..
నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. గత 30 ఏండ్లుగా రోజూ ఏదో ఒక సీరియల్లో నన్ను చూస్తూనే ఉంటారు. అనకాపల్లిలో పుట్టి చెన్నైలో పెరిగినా.. తెలుగు సినిమాలు, సీరియల్స్తో మీ నట్టింట్లో కనిపిస్తూనే ఉంటాన్నేను. నేను నాలుగో తరగతిలో ఉండగా.. ‘కుట్ర’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఎలా చేస్తానో అని భయపడ్డారు అమ్మానాన్న.
‘అదరగొట్టావమ్మాయ్’ అంటూ డైరెక్టర్ మెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. లాయర్ సుహాసిని, భారతంలో బాలచంద్రుడు, రాజేశ్వరి కల్యాణం, స్వయంకృషి.. అన్నీ పెద్ద సినిమాలే. రాజేంద్ర ప్రసాద్, కమలహాసన్, బాలకృష్ణ, మీనా, కృష్ణంరాజు, శోభన్బాబు, అల్లు రామలింగయ్య, చిరంజీవి.. అందరూ పెద్దవాళ్లే. ప్రధాన తారల చిన్నప్పటి పాత్రల కోసం నన్ను ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేవారు. తీరిక సమయాల్లో చాలా కబుర్లు చెప్పేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ‘బుల్లితెర విజయశాంతి’ అని పేరు పెట్టారు. తెలుగులో ‘అందం’ సీరియల్ నన్ను చాలామందికి దగ్గర చేసింది. ‘సుఖదుఃఖాలు’, ‘అతిథి’ నంది అవార్డు అందుకున్నాయి. ఇప్పటి వరకు అరవై సీరియల్స్లో నటించాను.
మా ఆయన విజయ్కృష్ణ సీరియల్ డైరెక్టర్. నన్ను ప్రాణంగా చూసుకుంటారు. మాకు ఇద్దరు అమ్మాయిలు.. గాయత్రి, సరయు. ఇంకా చదువుకుంటున్నారు. కుటుంబమే నా ప్రాణం. టైమ్ దొరికినప్పుడల్లా పిల్లలకు నచ్చిన వంటలు చేసి పెడతాను. బయటికి వెళ్లినప్పుడు అభిమానులు ఇబ్బంది పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది తెలిసీ తెలియక ఏదో అనేస్తుంటారు. అలాంటప్పుడు మాత్రం బాధగా అనిపిస్తుంది. ఒకరిద్దరి అనాలోచిత చర్యల వల్ల ఎక్కువ మంది ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందరిలో చైతన్యం రావాలి. అదే నేను కోరుకునేది.
…? సుంకరి ప్రవీణ్ కుమార్