కొన్నిసార్లు తక్కువ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా సంచలనం సృష్టిస్తుంటాయి. ఇప్పుడు ‘జాతిరత్నాలు’ సినిమా చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తోంది. రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ‘జాతి రత్నాలు’ ఓ రేంజ్లో కుమ్మేస్తుంది. కరోనా కారణంగా అక్కడ మన సినిమాలు చాలా తక్కువ వసూళ్లతోనే సరిపెట్టుకుంటున్నాయి.
ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక్కడ అంత పెద్ద విజయం సాధించిన ‘ఉప్పెన’ సినిమా ఓవర్సీస్లో మాత్రం కనీసం కోటి రూపాయలు తీసుకురాలేదు. మరోవైపు ‘క్రాక్’, ‘మాస్టర్’ లాంటి సినిమాలు కూడా ఇండియాలో సంచలనం రేపాయి కానీ విదేశాల్లో మాత్రం కరోనాకు బలైపోయాయి. అయితే ఇప్పుడు ‘జాతిరత్నాలు’ మాత్రం సంచలనం రేపుతుంది. అక్కడ ఇప్పటికే రూ.2 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రీమియర్స్ తోనే ఏకంగా లక్ష 33 వేల డాలర్లు వసూలు చేసి ‘మాస్టర్’ పేరు మీదున్న రికార్డులను తిరగరాసింది.
ఈ సినిమా 80 వేలకు పైగా డాలర్లు వసూలు చేసింది. అయితే ఇప్పుడు నవీన్ పొలిశెట్టి సినిమా మాత్రం దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే 2 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఈ జోరు వీకెండ్ అయ్యేవరకు కూడా ఇలాగే కొనసాగేలా కనిపిస్తుంది. ఇదే జరిగితే కరోనా తర్వాత హాఫ్ మిలియన్ వైపు అడుగులు వేసే తొలి సినిమా జాతిరత్నాలే అవుతుంది. ‘మాస్టర్’ లాంటి భారీ సినిమాకు కూడా సాధ్యం కాని రికార్డులను ఇప్పుడు చిన్న సినిమా తిరగరాస్తుంది. ఇక్కడ కూడా ఈ సినిమాకు తిరుగులేదు. మూడోరోజు కూడా అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.