మెలోడీని తన బలంగా భావిస్తానని చెప్పారు సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్. పోటీతత్వాన్ని తాను పట్టించుకోనని, డబ్బుకు ప్రాముఖ్యతనివ్వనని తెలిపారు. ‘హ్యాపీడేస్’, ‘కొత్త బంగారులోకం’, ‘మహానటి’ వంటి చిత్రాల్లో శ్రావ్యమైన బాణీలతో స్వరకర్తగా చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నారు మిక్కీ జే మేయర్. ఆయన సంగీతాన్ని అందించిన తాజా చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా మిక్కీ జే మేయర్
పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
భిన్న కాలాల నేపథ్యంలో సాగే పీరియాడికల్ లవ్స్టోరీ ఇది. నాని పాత్ర రెండు షేడ్స్లో సాగుతుంది. ఆ పాత్రలకు అనుగుణంగా సంగీతాన్ని అందించడం చాలెంజింగ్గా అనిపించింది. కోల్కతా బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాల కోసం ఉత్తరాది రాగాలను వాడుతూ కొత్తగా నేపథ్యసంగీతాన్ని సమకూర్చా. 1970 కాలంలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఆనాడు ఉపయోగించే సంగీతవాయిద్య పరికరాల్ని వాడాం. ఇటీవల మరణించిన గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన చివరి సినిమా ఇది. ఇందులో ఆయన రెండు పాటలు రాశారు. నా తొలి సినిమా ‘పోతేపోనీ’ నుంచి ఆయనతో అనుబంధముంది. సిరివెన్నెల మరణం నన్ను చాలా బాధించింది. గతంలో ఆయనతో నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. తన జీవితానుభవాల్ని నాతో చాలా సార్లు పంచుకున్నారు. ఆయన చనిపోవడానికి రెండు వారాల ముందు నాతో మాట్లాతూ అమెరికాలోని మా ఇంటికి వస్తానన్నారు. కానీ ఆ కల తీరకుండానే వెళ్లిపోయారు.
ప్రతి సినిమా తొలి చిత్రమే..
మెలోడీ నా బలం. ఆ శైలికి దూరం కాను. మాస్ సాంగ్స్ చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది సంగీతదర్శకులు ఉన్నారు. వారి దారిలో నేను వెళ్లను. కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విన్నా శ్రోతలు కొత్త అనుభూతికి లోనయ్యే బాణీల్ని సమకూర్చేందుకు ప్రయత్నిస్తుంటా. డబ్బు కంటే ఆత్మసంతృప్తికే ప్రాధాన్యతనిస్తా. టాప్టెన్లో నేను ఒకరిగా నిలవాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘హ్యాపీడేస్’కు ఎలా పనిచేశానో అదే భావనతో ఇప్పటికీ కష్టపడుతుంటా. ఇటీవలే ఇంగ్లీష్లో ఇండిపెండెంట్ సాంగ్ చేశా. స్పానిష్లో మరో పాట చేయబోతున్నా.