మేడ్చల్ రూరల్, మార్చి 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠధామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఉన్న వైకుంఠధామాల్లో సరైన రోడ్డు, నీటి వసతి, స్నానపు గదులు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పాలకవర్గం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లక్షలాది రూపాయలతో అభివృద్ధికి పూనుకున్నారు. దీంతో శ్మాశానవాటికల్లో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని పురోగతిలో ఉన్నాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఐదు శ్మశాన వాటికలను రూ.1.73 కోట్లతో అభివృద్ధి చేశారు. మైసమ్మగూడలో రూ.80 లక్షలు, కండ్లకోయలో రూ.50 లక్షలు, ఎస్సీ శ్మశాన వాటికకు రూ.15 లక్షలు, బీసీ శ్మశాన వాటికకు రూ.15 లక్షలు, జ్ఞానాపూర్లో రూ.13 లక్షలతో శ్మశాన వాటికలను అభివృద్ధి చేశారు.
మైసమ్మగూడలో నిర్మించిన వైకుంఠధామంలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా స్నానాల గదులు, వేచిచూసే గది, సీసీ రోడ్డు, నీటి సౌకర్యం కల్పించారు. ఎస్సీ శ్మశాన వాటికలో ఉన్న షెడ్ లోపల బల్లాలను గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. బోరుబావి తవ్వి నీటి సౌకర్యం కల్పించారు. బాత్రూంలు నిర్మించారు. బీసీ శ్మశానవాటికలో నేలను చదును చేయించి, బాత్రూంలకు మరమ్మతులు చేయించి ప్రహరీ నిర్మించారు. జ్ఞానాపూర్లో భవనాన్ని నిర్మించారు. నీటి సౌకర్యం కల్పించి, ప్రహరీ నిర్మించారు. కండ్లకోయలో రెండు దహన వాటికలు, వేచి చూసే గదిని, ప్రహరీని నిర్మించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వైకుంఠధామాల అభివృద్ధికి అధిక పాధాన్యతనిస్తున్నాం. ప్రజలు వైకుంఠధామాల్లో నీరు, స్నానపు గదులు, ప్రహరీ తదితర సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బాధతో అంతిమయాత్ర నిర్వహిస్తున్న వారికి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదన్న లక్ష్యంతో ఐదు వైకుంఠధామాలను అభివృద్ధి చేశాం. మైసమ్మగూడలోని వైకుంఠధామానికి కేటాయించిన నిధులు సరిపోవడం లేదు. మరిన్ని నిధులు కేటాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. త్వరలో అన్ని చోట్ల పచ్చదనాన్ని కూడా పెంపొందిస్తాం. -మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, చైర్పర్సన్, గుండ్లపోచంపల్లి
మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడ కూడా నాణ్యత లోపం లేకుండా పనులు జరిగేలా చూస్తున్నాం. వైకుంఠధామాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఆధునిక వసతులు కల్పిస్తున్నాం. -చిరంజీవులు, డీఈ, గుండ్లపోచంపల్లి