కుత్బుల్లాపూర్,జూలై22: వరుసగా కురుస్తున్న వర్షం ప్రభావంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ జంట సర్కిళ్లలో వర్షం ఇబ్బందులను అధిగమించేందుకు అధికారయంత్రాంగం అలర్ట్గా ఉండాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో జంట సర్కిళ్ల అధికారుయంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిన్నపాటి వర్షానికే ముంపుకు గురవుతున్న పలు కాలనీల్లో వరదనీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీరామ్నగర్, బాలాజీ లే-అవుట్, చంద్రగిరినగర్, మోతీనగర్, వోక్షిత్ ఎంక్లేవ్, సోనియాగాంధీనగర్, శ్రీకృష్ణానగర్, రావినారాయణరెడ్డినగర్, వెంకన్నహిల్స్, మోడీబిల్డర్స్, గణేశ్నగర్, గోదావరిహోమ్స్, జయరాంనగర్, ఫాక్స్సాగర్ కోల్నాలా దిగువ ఉన్న సుభాష్నగర్ ఎన్సిఎల్ కాలనీల్లో వర్షాలు అధికంగా కురిసిన సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలన్నారు. రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని ఎన్టిఆర్ విగ్రహం వద్ద నూతనంగా కల్వర్టు అభివృద్ధికి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించేలా మాన్సూన్ టీంలు రంగంలోకి దిగాలన్నారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మంగతాయారు, ప్రశాంతి, ఈఈ క్రిష్ణచైతన్య, డీఈలు, ఏఈలు, హెల్త్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.