మేడ్చల్, ఆగస్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని, ఇందులో భాగంగా రూ.127 కోట్లతో 17 పాలిటెక్నిక్ కళాశాల భవనాలు నిర్మించామని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 12 నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహం, రూ.38 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ ప్రహరీగోడను బుధవారం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మెరుగైన వైద్యసేవల కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 దవాఖానలు నిర్మాణం కాబోతున్నాయని చెప్పారు. పదోతరగతి, ఇంటర్ తర్వాత చదువు ఆపకుండా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎస్ఆర్ నిధులతో ఘట్కేసర్ మండలం కొండాపూర్లో ఐటీఐ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అనుమతితో ఐటీఐ స్థలాన్ని తీసుకొని రోడ్డు విస్తరణ చేస్తున్నామని, మేడ్చల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయిస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందారెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, సింగిల్విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.