పీర్జాదిగూడ, మార్చి 14: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధి…పర్వతాపూర్లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం భక్తజన కోలాహలం నడుమ వేద బ్రాహ్మణులతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి శిష్యులు, రామాంజనేయ స్వామి వారి పర్యవేక్షణలో కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్థానిక అరోరా కళాశాల నుంచి స్వామి వారి శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామి వారిని ఆరాధిస్తూ నిత్య పూజల కార్యక్రమంతో పాటు వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మికతతో వెల్లివెరిసింది. కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్రెడ్డి హాజరై స్వామికి పట్టు వస్ర్తాలను అందజేసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకురాలు యాదామాతా, కమిటీ సభ్యులు, అర్చకులు శ్రీకాంత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.