చౌటకూర్, మార్చి 27: సినిమాలు, సీరియల్స్లో మహిళలదే అగ్రస్థానమని, భవిష్యత్తులో మరింతగా ఎదగాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ సాజిదాఖాన్ అన్నారు. మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె కళాశాలలోని సెమినార్ హాలులో జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో మహిళలు వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది శుభపరిణామమన్నారు. రంగస్థలం మొదలుకొని సినిమా, సీరియళ్లు, న్యూస్ రీడర్స్, ఇతర రంగాల్లో మహిళలదే అగ్రస్థానమని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నాయన్నారు. దీంతో మహిళలకు ఆయా రంగాల్లో అనేక అవకాశాలు దక్కుతున్నాయన్నారు. రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. తాను కూడా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగానని, అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యానన్నారు. ఏ పనినైనా ఇష్టంగా చేస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ మహిళలు తలచుకుంటే కాని పని ఉండదని, కావాల్సిందల్లా చిత్తశుద్ధి, పనిపై ఏకాగ్రత అన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన మెళకువలను విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నర్సింహ, వైస్ ప్రిన్సిపాల్ రాఘవేందర్రావు, వివిధ విభాగాధిపతులు ప్రసన్నలక్ష్మి, సునీత, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.