సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 20 : సిద్దిపేట పోలీస్ పరేడ్ మైదానం దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. పోలీస్శాఖలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రేపటి(గురువారం) నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పది రోజుల పాటు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావు లేకుండా బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల నిఘా నీడలో ఫిజికల్ టెస్ట్లు నిర్వహించనున్నారు.
పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్ ఈవెంట్, 1600, 800 ట్రాక్, లాంగ్ జం ప్, షాట్పుట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ఏరియా, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ తదితర విషయాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు సీపీ తెలిపారు. ఈవెంట్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని, మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని సీపీ శ్వేత తెలిపారు.
పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఫిజికల్ ఈవెంట్స్
సర్టిఫికెట్ పరిశీలన నుంచి దేహదారుఢ్య పరీక్షల వరకు వినూత్న రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించనున్నారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నారు. పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్ల పరుగుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్లను, అలాగే ప్రతి అభ్యర్థికి రిస్ట్ బ్యాండ్ అమర్చనున్నారు. రిస్ట్ బ్యాండ్ను చేతి నుంచి ఏ అభ్యర్థి తీసివేయడం గానీ, డ్యామేజ్ గానీ చేయకూడదు. అలా చేస్తే అనర్హులుగా ప్రకటిస్తారు. ఆర్ఎఫ్ఐడీ ప్యాడ్ను అభ్యర్థికి తగిలించడంతో ఎంత సమయంలో గమ్యం చేరారన్నది. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆటోమోటిక్గా రికార్డు నమోదు కానున్నది. షాట్పుట్, లాంగ్ జంప్ కోసం డిజిటల్ థియోడ్లైట్స్ను ఉపయోగించడం ద్వారా ఆన్లైన్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి బోర్డ్ సర్వర్లో అప్లోడ్ కానున్నది.
9,983 మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్లు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 9,983 మంది అభ్యర్థులకు శారీరక దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యారు. ఇందులో 8,013 మంది పురుషులు, 1,970 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. షాట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్లో క్వాలిఫై మేరకు మాత్రమే నమోదు చేస్తారు. పరుగులో మాత్రం అభ్యర్థికి మార్కులను కేటాయిస్తారు. ఈ వ్యవహారం అంతా ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు సర్వర్లోకి అప్లోడ్ అవుతుంది.
పారదర్శకంగా విధులు నిర్వహించాలి
పది రోజుల పాటు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షల్లో పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని సీపీ శ్వేత ఆదేశించారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బందోబస్తు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి సీపీ శ్వేత దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేడు(బుధవారం) ఉదయం ట్రయల్ నిర్వహిస్తామని, 16 పాయింట్స్గా బందోబస్తు ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించి.. జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఐడెంటిటీ కార్డులు ఇస్తామని, వారికి మాత్రమే గ్రౌండ్లోకి అనుమతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్, అడ్మిన్ అడిషనల్ డీసీపీలు మహేందర్, సుభాష్ చంద్రబోస్, రామచంద్రరావు, ఏసీపీ దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అభ్యర్థులకు కొన్ని సూచనలు
దళారులను నమ్మి మోసపోవద్దు..
పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఎవరైనా దళారులుగా ఉద్యోగం ఇప్పిస్తామని లేదా క్వాలిఫై చేయిస్తామని ప్రలోభాలకు గురి చేస్తే నమ్మి మోసపోవద్దు. అలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్ 08457-226333 నెంబర్కు సమాచారం అందించాలి. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదు. ప్రతి విషయం టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఎక్కడా మానవ ప్రమేయం ఉండదు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. భవిష్యత్లో ఏవైనా విమర్శలు వస్తే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడతాం.
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత