నిజాంపేట, ఫిబ్రవరి 8: చల్మెడలో తిరుమలనాథ స్వామి బ్ర హ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుమలనాథ జాతరకు భక్తులు పోటెత్తారు. స్వామివారి ఆలయానికి కొందరు నడుచుకుంటూ, మరికొందరు వాహనాల్లో, ఎండ్లబండ్లపై వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, సభ్యులు ధ్వజారోహణం, మూలమూర్తుల అభిషేకం, స్వామివారి అలంకారం, నైవేద్యం, హారతి కార్యక్రమాలు చేపట్టారు. వేద బ్రహ్మణులు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఎస్సై ప్రకాశ్గౌడ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నందిగామ,చల్మెడ గ్రామాలకు చెందిన రైతులు తమ ఎడ్లకు, బండ్లకు వివిధ రంగులతో తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఇలా చేయడం వల్ల పాడిపంటలతో సుఖంగా ఉంటామని రైతుల నమ్మకం. ఎడ్లబండ్ల ముం దు బైండ్లవారి పాటలు, శివసత్తుల ఆటలు అక్కడి భక్తులను ఆకట్టుకుంది. జాతరకు నిజాంపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలనుంచి, హైదరాబాద్, ఇతర రాష్ర్టాల నుంచి 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
స్వామివారి కల్యాణానికి విచ్చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ మహే శ్, సభ్యులు, వేదబ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టువస్ర్తాలు సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే కల్యాణ మండపం అందుబాటులోకి వస్తుందని అ న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, చల్మెడ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ బాల్రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్ ఉన్నారు.