మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 4: మనకు మేలు చేసే వేప చెట్టుకు మళ్లీ ఆపదొచ్చింది. గతేడాది హఠాత్తుగా ఎండిపోయిన వేపచెట్లు మళ్లీ ఈ ఏడాది అదే మాదిరిగా ఎండిపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం ఇదే మాదిరిగా ఎండిపోయిన చెట్లు కొన్ని నెలల తర్వాత మళ్లీ చిగురించాయి. కొద్దికాలం పాటు వేప చెట్లు పచ్చగా కనిపించాయి. గ్రామాల్లో ఒక్కసారిగా వేప చెట్లు తిరిగి గతేడాది మాదిరిగానే ఎండిపోతున్నాయి. దీంతో వేప చెట్ల వద్దకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కనీసం వేప పుల్లను వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. వేప చెట్లు అర్ధంతరంగా ఎండిపోతుండడంతో కొంతమంది వాటిని నరికివేస్తున్నారు.
వేపకు మాయదారి రోగం…
వేప చెట్లకు మాయదారి రోగం వచ్చిందని అందుకే చెట్లు ఎండిపోతున్నాయని గ్రామీణ ప్రజలు అమాయకంగా భయపడుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం వేపకు ‘డై బ్యాక్ డిసీజ్’ లేదా ‘ట్రీ మస్కిటో బగ్’ అనే తెగుళ్ల సోకడంతో వేప చెట్లు ఎండిపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వర్షాలు అధికంగా కురవడంతో వేప చెట్లకు ఈ ప్రమాదం సంభవించిందని మరికొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో పలువురు అయోమయానికి లోనవుతున్నారు. కాగా, ఎండిపోతున్న వేప చెట్ల భాగాలను తొలిగించడం, శిలీంద్ర నాశనులైన పురుగు మందులను చెట్లపై పిచికారీ చేయడం ద్వారా దీని వ్యాప్తిని కొంతమేర నివారించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వేపలో ఔషధ గుణాలెన్నో…
గ్రామీణ ప్రజానీకానికి వేపతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఊళ్లలో నేటికీ నాటితరం మనుషులకు పొద్దున వేప పుల్లతో పండ్లు తోముకొనిదే దినచర్య మొదలుకాదు. ఆయుర్వేదంలో వేపాకు పూత, బెరడుకు ఎంతో ప్రాధాన్యముంది. చాలా మందుల్లో ఈ వేపకు వినియోగిస్తారు. ప్రధానంగా డయాబెటిస్ నివారణలో వేపను విరివిగా ఉపయోగిస్తారు. పండుగలు, పూజలకు వేప కొమ్మలను గుమ్మాలకు కట్టడం హిందువులకు ఆచారంగా వస్తున్నది. పిల్లలకు అమ్మతల్లి వస్తే వేప కొమ్మలను దంచి పెడుతారు. ఇండ్లలో దోమలను తరిమేందుకు వేపాకు పొగ వేస్తారు. పంటల మీద చీడపీడలను వదిలించేందుకు వేపాకు రసాన్ని పిచికారీ చేస్తారు. అంతేకాకుండా వేప ఉత్పత్తులపై మన దేశానికి పేటెంట్ హక్కులు కూడా ఉండడం విశేషం. ఇంతటి ప్రాముఖ్యత గల సంజీవని లాంటి వేప చెట్లు ఎండిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు.
నివారణ చర్యలు తీసుకోవాలి
మన చుట్టూ ఉన్న వేప చెట్లు డైబ్యాక్ అను వ్యాధితో ఎండిపోతున్నాయి. ఫోమోస్పిస్ అజాడరిక్టే అను శిలీంధ్రం సోకడంతో ఇలా జరుగుతుంది. సహజ సంజీవనిగా చెప్పుకునే వేపను కాపాడుకోవడం సామాజిక బాధ్యత. వేపకు సో కిన ఈ డిసీజ్ నివారణ కోసం మొదటి చర్యగా కార్బెండిజిమ్(బావిస్టాన్) మందును లీటర్ నీటికి 2గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిచే విధంగా పోయాలి. రెండో చర్యగా ఏడు రోజుల తర్వాత థయోఫనేట్ మీథైల్ మందును లీటర్ నీటికి 2గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిచే విధంగా పోయాలి. మూడో చర్యగా ప్రోఫినోఫాస్ మందును లీటర్ నీటికి 3 మిలీలీటర్ కలిపి చెట్టు మొదలు తడిచే విధంగా పోస్తే వేపకు సోకిన వ్యాధిని కొంతమేర అరికట్టవచ్చు.
– మమత, హార్టికల్చర్ ఆఫీసర్, మద్దూరు (సిద్దిపేట జిల్లా)