మెదక్ అర్బన్, ఫిబ్రవరి13: ఐదో జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో జిల్లా పోలీస్ సాయుధ దళ కానిస్టేబుల్ టి.ప్రభాకర్గౌడ్ కాంస్య పథకం సాధించడంతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ బాలస్వామి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు జీహెచ్ఎంసీ బాలయోగి స్టేడియం గచ్చిబౌలి, హైదరాబాద్లో నిర్వహించిన 5వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని ఉత్త మ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో కాంస్య పథకం సాధించారన్నారు.
మే నెలలో శ్రీలంకలో జరుగనున్న అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో దేశం తరఫున పాల్గొనడానికి ఎంపికవడం జిల్లా, రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా పోలీస్శాఖలో క్రీడాకారులు పోటీల్లో పాల్గొని పథకాలు సాధించడానికి అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్, సాయుధ దళ డీఎస్పీ రంగనాయక్, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.