సిద్దిపేట అర్బన్, జనవరి 4 : సమాజంలో మహిళలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర హింసకు గురవుతూనే ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఇప్పటికే సఖీ, భరోసా లాంటి సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి డివిజన్లో షీ టీమ్లను ఏర్పాటు చేసి మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. గృహ హింసకు గురువుతున్న మహిళలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల దృక్పథంలో పనిచేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేసి వాటికి నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా 23 సంవత్సరాలుగా మహిళలు, బాలిక హక్కుల కోసం పని చేస్తున్న స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సమన్వయంతో మహిళల సహాయక కేంద్రం ‘స్నేహిత’ సెంటర్ను సిద్దిపేట పట్టణలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ను నేడు మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించనున్నారు.
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, హింసల నుంచి రక్షణ కల్పించడానికి వారికి అవసరమైన అన్ని సహాయం అందించడానికి ఈ కేంద్రం కృషి చేస్తున్నది. మహిళలు, శారీరకంగా, మానసికంగా ఇంట్లో, బయట ఎలాంటి హింసలను భరించకుండా తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం స్నేహిత సెంటర్ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యం గా గృహ హింసకు గురైన మహిళలకు ఈ కేంద్రం పలు రకాల సేవలు అందిస్తున్నది.
మహిళా రక్షణతో పాటు.. ఫ్రెండ్లీ పోలీస్ ప్రభుత్వం అనటానికి ఈ స్నేహిత సెంటరే నిదర్శనమని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో స్నేహిత సెంటర్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, సిద్దిపేటలో ఇప్పటికే మహిళా పోలీస్ స్టేషన్, సఖీ సెంటర్, భరోసా సెంటర్ ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్నేహిత ద్వారా మహిళలకు అనేక ప్రయోజనాలు పొందేలా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.