ప్రశాంత్నగర్, ఏప్రిల్ 8 : ప్రజలకు ఆరోగ్యం.. ఆహ్లాదం రెండూ ముఖ్యమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటికే సిద్దిపేటను అభివృద్ధికి చిరునామాగా.. ఆదర్శంగా నిలిపామని, కోమటి చెరువుపై అన్ని వసతులతో నెక్లెస్ రోడ్డును అందుబాటులోకి తెచ్చామన్నారు. గురువారం సిద్దిపేట కోమటి చెరువు వద్ద నెక్లెస్ రోడ్డును జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు వచ్చినప్పుడు కోమటి చెరువు అభివృద్ధికి మరో రూ.25 కోట్లు కేటాయిస్తూ నెక్లెస్ రోడ్డు మంజూరు చేశారన్నారు. రాబోయే రోజుల్లో కట్ట ఎక్కితే, కోమటి చెరువు చుట్టూ తిరిగే అవకాశం ఉందన్నారు. వాకర్స్కు మోకాలి నొప్పులు రాకుండా నడవడానికి సులువుగా ఉండేట్లు సింథెటిక్ ట్రాక్, వాకింగ్ ట్రాక్తో పాటు, సైక్లింగ్ సింథెటిక్ ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు. ఓపెన్జిమ్తో పాటు ప్రజలకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇది వరకు రోడ్డుపై వాకింగ్ చేసే వారు, ఇప్పుడు నెక్లెస్ రోడ్డుపై వాకింగ్ చేసుకోవచ్చన్నారు. సిద్దిపేటలో స్టేడియం, సిమ్మింగ్పూల్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రెండున్నర కోట్లతో పుట్బాల్ కోర్టు అందుబాటులోకి తీసుకవస్తామన్నారు. త్వరలో వాలీబాల్ అకాడమీ అందుబాటులోకి తెస్తామన్నారు. డాక్టర్ శాంతి సహకారంతో వార్డు కంపోస్టులు, స్వచ్ఛ బడి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ సిద్దిపేటను ఆదర్శంగా నిలుపుతున్నామన్నారు. 10 జాతీయ అవార్డులు పట్టణానికి వచ్చాయన్నారు. పాలకవర్గంతో పాటు ప్రజలు, సిబ్బందితో సమష్టి కృషితో సిద్దిపేటను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రూ.25 కోట్లతో ఏడాదిలోగా పూర్తి స్థాయి నెక్లెస్ రోడ్డు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇటీవల ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే శివప్రసాద్ వచ్చిపోయారన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ 6 నెలలకు సిద్దిపేటలో వినూత్నంగా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. సిద్దిపేట నెక్లెస్ రోడ్డు చాలా బాగుందన్నారు. దేశానికే రోడల్ మోడల్గా సిద్దిపేట మారిందన్నారు. ఇది అక్షరాల నిజమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్రెడ్డి, ప్రవీణ్, తాళ్లపల్లి లక్ష్మీసత్యనారాయణగౌడ్ తదితరులు ఉన్నారు.