సిద్దిపేట అర్బన్, జూలై 21 : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి తనకున్న 10ఎకరాల భూమికి రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు గురువారం తిరిగి అందజేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి శివకుమార్ సమక్షంలో రైతుబంధు తమకు వద్దని, తమ డబ్బులను ఫ్రీజ్ చేసి, వాటిని వేరే రైతులకు అందజేయాలని వినతి పత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వారిని అభినందించారు.
ఈ సందర్భంగా ఫార్మర్స్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నవారు రైతుబంధు పొందడం సరైంది కాదని, ఇప్పటికైనా రైతుబంధు తిరిగి ఇచ్చేసి కష్టపడుతున్న రైతులకు అందేలా చూడాలని కోరారు. రైతులపై ప్రేమతోనే ‘రైతుబంధు గీవ్ ఇట్ అప్’ అంటూ తిరిగి వెనక్కి ఇచ్చేశామని తెలిపారు. తనకు రైతుబంధు అవసరం లేదని, తనలా అందరూ ఆలోచించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రైతుబంధు వెనక్కి ఇచ్చి నిరుపేద, చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మర్స్ ఫౌండేషన్ సభ్యు లు శ్రవణ్ కుమార్ గౌడ్, కస్తూరి హరీశ్, ప్రశాంత్, సతీష్ పాల్గొన్నారు.