ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించే లక్ష్యంతో అధికారులు గ్రామాల్లో ముమ్మరంగా ఓటరు నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 2,3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై బీఎల్వోలు ఊరూరా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో దండోరా వేయడంతో పాటు గ్రామ పంచాయతీలో మైకుల్లో తెలియజేస్తున్నారు. తప్పులు లేకుండా ఓటరుజాబితా తయారుచేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. నియోజకవర్గాల బీఎల్వోలకు ఎప్పటికప్పుడు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు విధులు నిర్వర్తించేలా శిక్షణ ఇస్తున్నారు. ఓటరు నమోదుకు యువతీయువకులను, రిసోర్స్ పర్సన్లను, మహిళాసంఘాలను, టీచర్లను భాగస్వామ్యం చేస్తున్నారు. ఓటరు ముసాయిదాను పరిశీలించి తప్పొప్పుల సవరణ, లిస్టులో ఉన్న పేర్లపై ఆక్షేపణలు, అభ్యంతరాలను సెప్టెంబర్ 28న తొలిగిస్తారు. అక్టోబర్ 4న ఎన్నికల కమిషన్ ఓటరు తుది జాబితాను ప్రచురిస్తుంది.
– సిద్దిపేట, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాలో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు ముసాయిదాను పరిశీలించి ఓటరుగా ఇప్పటివరకు గుర్తించని, తప్పొప్పుల సవరణ, లిస్టులో ఉన్నటువంటి పేర్లపై ఆక్షేపనలు, అభ్యంతరాలను తెలపడానికి సెప్టెంబర్ 19 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా వచ్చిన ఆక్షేపణలను విచారణ చేసి సెప్టెంబర్ 28న ఆక్షేపణలు, అభ్యంతరాలను తొలగిస్తారు. అక్టోబర్ 1న తుది జాబితా కోసం ఎలక్షన్ కమిషన్ అనుమతికి పంపుతారు. అనుమతి పొందిన అనంతరం అక్టోబర్ 4న ఓటరు తుది జాబితాను ప్రచురిస్తారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన ముసాయిదా ఓటరు జాబితాను చూసుకొని కొత్త ఓటరు నమోదు కోసం ఫారం-6, తప్పొప్పుల సవరణకు ఫారం-8, ఓటర్ల జాబితాలోని పేర్లపై ఆక్షేపణలు, వలసపోయిన, చనిపోయిన వారి వివరాలు తెలపడానికి ఫారం-7ను వినియోగిస్తారు. ఇదిలాఉంటే ఈవీఎంలు, స్ట్రాంగ్ రూంలతోపాటు అవసరమైన సిబ్బంది తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. 1 అక్టోబర్ 2023 నాటికి 18 ఏండ్లు నిండనున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఈనెల 2, 3 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రజలకు విసృ్తతస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల్లో దండోరా వేయడంతోపాటు గ్రామ పంచాయతీలో మైకుల్లో తెలియజేస్తున్నారు.
తప్పులు లేకుండా ఓటర్ల జాబితా తయారుచేసే పనిలో అధికార యంత్రాం గం, బీఎల్ఓలు నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల బీఎల్ఓలకు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు విధులు నిర్వర్తించేలా శిక్షణ ఇస్తున్నారు. అర్హులు ఓటరుగా నమోదయ్యేలా బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఫారం-6తో నూతన ఓటర్లు నమోదు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని బీఎల్ఓల వద్ద ఫారం 6, 7, 8లు అందుబాటులో ఉంచారు. నూతన ఓటర్ల నమోదుతోపాటు ఫారం 7తో అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు, యువజన సంఘాల సభ్యులతో కలిసి గ్రామస్తులతో చర్చించి చనిపోయిన ఓటర్లందరి పేర్లు జాబితా నుంచి తొలిగిస్తున్నారు. ఓటరు లిస్టులో తప్పొప్పుల సవరణ కోసం ఫారం 8 ద్వారా తప్పుల సవరణ చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేసి ఎన్నికల అధికారులకు పంపిస్తున్నారు. ట్రాన్స్జెండర్, అనాథలను ఓటరుగా నమోదు చేయుటకు బీఎల్ఓలు తుది నిర్ణయం తీసుకొని నమోదు చేస్తారు. ఓటరు నమోదుకు యువతీయువకులను, రిసోర్స్ పర్సన్లను, మహిళాసంఘ గ్రూపులు, టీచర్లను భాగస్వామ్యం చేస్తున్నారు. 18 ఏండ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. తప్పులు లేకుండా ఓటరు జాబితాను సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన తప్పులు లేకుండా తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనున్నది.