సిద్దిపేటరూరల్, ఫిబ్రవరి 19: సిబ్బంది మర్యాదగా ప్రవర్తించి సమస్యను తెలుసుకోవాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్, భరోసా, సఖీ సెంటర్లను సోమవారం ఆమె సందర్శించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఐఎస్ అమలులో భాగంగా ఫైళ్లను తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటు లో ఉండాలని సూచించారు. భరోసా సెంటర్కు వెళ్లి నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భరోసా కల్పించాలని, మహిళలు, పిల్లలకు సకాలంలో సేవలు అందించాలన్నారు.
సఖీ సెంటర్ను సందర్శించి మహిళలు, అనాథ మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం రూరల్ పోలీస్స్టేషన్ ఎస్సై అపూర్వరెడ్డి, సిబ్బందితో మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఇసుక, పీడీఎస్ బియ్యం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలు, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి ప్రజలు, యువత, విద్యార్థినులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సీపీ వెంట రూరల్ పోలీస్స్టేషన్, భరోసా, సఖీ సెంటర్ సిబ్బంది ఉన్నారు.