మెదక్ మున్సిపాలిటీ, మార్చి 1 : ప్రస్తుత విద్యా సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం పెండింగ్లోని రెన్యూవల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని అడిటోరియంలో వసతి గృహా ల సంక్షేమాధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుకునే పేద పిల్లలకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు అండగా ఉంటాయని, డబ్బు సమస్య లేకుంటే విద్యార్థి చదువుపై ద్యాస ఉంటుందని, చదువులో చక్కగా రాణిస్తారన్నారు.
అర్హులైన ఏవిద్యార్థి నష్టపోకుండా ఉపకార వేతనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 20 21-22కు సంబంధించి కళాశాల స్థాయిలో పెండింగ్లో ఉన్న 192 దరఖాస్తుల పునరుద్ధరణ (రెన్యూవల్), ప్రస్తుత విద్యా సంవత్సరంలో పెండింగ్లోని 201నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు బయోమెట్రిక్ను పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 15లోగా హార్డ్కాఫీలను సంబంధింత కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ కశాశాలల ప్రిన్సిపాళ్లకు, ప్రతినిధులకు సూచించారు. విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో సత్వర చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు.
విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోని కళాశాలలో బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయాలని, ఈ-పాస్ లాగిన్లో విద్యార్థుల బ్యాంకు వివరాలు తప్పుగా నమోదైతే సరిచేయాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన ధ్రువపత్రాలు అన్ని సిద్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు ఉపకార వేతనాలకు నిధుల కొరత లేదన్నారు. ఈ సమావేశంలో మెదక్ ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్, కళాశాలల ప్రిన్సిపాళ్లు, వసతిగృహాల సంక్షేమాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.