న్యాల్కల్, జనవరి 9: ఏడాది పొడువునా ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజు వర సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మంగళవారం వచ్చే అంగారక సంకష్టహర చతుర్థి రోజున దర్శించుకుంటే అత్యంత పుణ్యఫలం వస్తుంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్లో స్వయంభుగా వెలిసిన సిద్ధి వినాయక ఆలయం మంగళవారం నిర్వహించనున్న అంగారక సంకష్ట హర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది. ఈ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా భారీగా తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఆలయంలోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో రూరల్ సీఐ శ్యామల వెంకటేశ్, హద్నూర్ ఎస్సై వినయ్కుమార్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్, తాగునీరు, వసతి, అన్నదానం తదితర సదుపాయాలు కల్పించారు. అంగారక సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు స్వామికి ఆభిషేకం, గణపతి హవనం, స్వామివారి కల్యాణం, హారతి తదితర ప్రత్యేక పూజలు చేపట్టనున్నామని ఆలయ వేద పండితులు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జహీరాబాద్, బీదర్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం తెల్లవారు జామున సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి అభిషేకం, హారతి తదితర పూజలు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై సిద్ధివినాయక స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ ఆశోక్, ప్రధాన కార్యదర్శి అలాడి నర్సింలు కోరారు.
నేడు వరసిద్ధి వినాయక స్వామి 223వ జయంతి
విఘ్నాలను నివారించి శ్రీఘంగా తలచిన వాటిని నిర్విఘ్నంగా నెరవేర్చే హద్నూర్ గ్రామ శివారులో స్వయంభుగా వెలిసిన వరసిద్ధివినాయక స్వామి 223వ జయంతి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయంలో వేదఘోష, దీప ప్రజ్వలన, ధ్వజారోహణ, స్వస్తి పుణ్యాహ వాచనం, అభిషేకం, దేవతా ఆహ్వానం, హారతి, గణపతి హవనమాలు, హోమ సమాప్తి, పూర్ణాహుతి, మహా మంగళ హారతి, నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు గణపతి దీక్షిత్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీతో పాటు పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేశారు.