సదాశివపేట, ఆగస్టు 8: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్లో భూములకు పెరిగిన ధరల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్, సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపూర్ శివారులో అధికారులు డిజిటల్ భూ సర్వే నిర్వహించారు.
సర్వేకు ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. త్రిబుల్ఆర్ రింగ్ రోడ్డు వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి భూసర్వే చేయాలని డిమాండ్ చేశారు. తమ తాతల కాలం నుంచి వస్తున్న భూములను కోల్పోతే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని, భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం జాతీయ రహదారి 65పై ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తు న్న రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు.