సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 17: రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరవేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో యాసంగి యాక్షన్ ప్లాన్, రైతు బీమా క్లెయిమ్స్, పంట రుణాలు, రైతు శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు బీమాకు సంబంధించిన డబ్బులు బాధిత కుటుంబాలకు త్వరితగతిన అందేలా క్లెయిమ్ సెటిల్మెంట్ వేగంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. నాలుగు, ఐదు రోజుల్లో రైతు బీమా క్లెయిమ్ అప్ లోడ్ చేయాలన్నారు. 2022-23 యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేశారు. రైతులకు యాసంగి పంట రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు సంబంధించిన ఆయా పథకాల ప్రగతిని జిల్లా, మండల ఏఈవోల కార్యాలయాల్లో, రైతు వేదికల్లో ప్రదర్శించాలన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ వినియోగం, పంటల నాణ్యతా ప్రమాణాలు, సాగు మెలకువలు, అధిక దిగుబడి వంగడాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు, ఉద్యాన శాఖ అధికారి సునీత, ఏడీఏలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.