సంగారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/మునిపల్లి: సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రూ.2653 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. నారాయణఖేడ్, అందోనియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలు సాగు నీరందించే ఈ ఎత్తిపోతల పనులను గత ఫిబ్రవరిలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నిర్మాణ పనులను బుధవారం మునిపల్లి మండలం చిన్నచెల్మడ గ్రామంలో మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా చిన్నచెల్మడలో పంప్హౌస్ నిర్మించనున్నారు. దీనికోసం 35 ఎకరాల భూమి అధికారులు సేకరించారు. పంప్హౌస్ నిర్మాణ పనుల్లో మంత్రి హరీశ్రావుతోపాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చిన్నచెల్మడలో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్, అందోల్ నియోజవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కలెక్టర్ శరత్ ఇటీవల ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశమై భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రైతులకు వరం…
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సంగారెడ్డి జిల్లా రైతుల పాలిట వరంగా మారనున్నది. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందనున్నది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు తరలిరానున్నాయి. మంజీరా ప్రాజెక్టుకు వచ్చే నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు వీలుగా జహీరాబాద్ నియోజకవర్గంలో మంజీరా నది సమీపంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ప్రభుత్వం రూ.2653 కోట్లతో నిర్మించనున్నది. దీనిద్వారా జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలోని 231 గ్రామాలకు సాగునీరు అందనున్నది. మొత్తం 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. ఈ ఎత్తిపోతలకు మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది. జహీరాబాద్ మండలం హోతి(కె), మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడలో రెండు పంప్హౌస్లు నిర్మిస్తారు. రెండు పంప్హౌస్లతో పాటు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం 113 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని గుర్తించింది. 240 కిలోమీటర్లతో 12 ప్రధాన కాల్వలు, 1100 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మించనున్నారు. పంప్హౌస్ల నిర్మాణం, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం కోసం మొత్తం 6727 ఎకరాల భూమి ప్రభుత్వం భూసేకరిస్తున్నది.
బీడు బారిన భూముల్లోకి గోదావరి జలాలు
సాగునీరు లేక దశాబ్దాలుగా బీడు మారిన భూముల్లోకి సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు తరలిరానున్నాయి. సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలకు సాగునీరు అందనున్నది. న్యాల్కల్ మండలంలోని 20 గ్రామాల పరిధిలోని 21,880 ఎకరాలు, ఝరాసంగం మండలంలోని 34 గ్రామాల పరిధిలోని 24,535 ఎకరాలు, మొగుడంపల్లి మండలంలోని 15 గ్రామాల్లోని 23,000 ఎకరాలు, జహీరాబాద్ మండలంలోని 21 గ్రామాల పరిధిలోని 22,415 ఎకరాలు, కోహీర్లోని 15 గ్రామాలకు చెందిన 11,429 ఎకరాలకు సాగునీరు అందనున్నది. అందోలు నియోజకవర్గంలోని రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని 65,816 ఎకరాలు సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందనున్నది. రాయికోడ్ మండలంలోని 34 గ్రామాల్లోని 29,940 ఎకరాలు, మునిపల్లి మండలంలోని 32 గ్రామాల పరిధిలోని 35,876 ఎకరాలకు సాగునీరు అందనున్నది. సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని 49,925 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సదాశివపేట మండలంలోని 27 గ్రామాల్లోని 37,525 ఎకరాలు, కొండాపూర్ మండలంలోని 13 గ్రామాలకు చెందిన 8730 ఎకరాలు, సంగారెడ్డి మండలంలోని ఆరు గ్రామాల్లోని 2435 ఎకరాలు, కంది మండలంలోని నాలుగు గ్రామాల్లోని 1235 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తయి తమ పొలాలకు సాగునీరు రావాలని రైతులు వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
నేడు మంత్రి పర్యటన విజయవంతం చేయాలి
మునిపల్లి, జూన్ 6: మండల పరిధిలోని చిన్నచెల్మెడ గ్రామంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను నేడు (బుధవారం) రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికి కిరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మంగళవారం చిన్నచెల్మడలో సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసే కార్యక్రమం చర్రితలో నిలుస్తుందన్నారు. మండలంలోని చిన్నచెల్మడలో ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎంతో జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయలని ఎమ్మెల్యే కోరారు.
బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలి…
మండలంలోని తక్కడపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మాణం చేపడుతున్న వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. తక్కడపల్లి, గార్లపల్లిల మధ్య నూతనంగా నిర్మాణం చేపడుతున్న వంతెన నిర్మాణం పూర్తి అయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గుతుందన్నారు. అందుకు సంబంధిత అధికారులు త్వరలో పనులు ప్రారంభించి వంతెన నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర నాయకులు సాయికుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, వివిధ గ్రామాల సర్పంచ్లు విజయ్భాస్కర్, శ్రీనివాస్, రమేశ్, ఎంపీటీసీ రాజశేఖర్, రైతుబంధు మండల సమితి అధ్యక్షుడు పరశురాంగౌడ్ తదితరులు ఉన్నారు.