చేర్యాల, జనవరి 7: కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులతో కొందరు పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ స్వామివారి కల్యాణోత్సవంలో తమను ఎవరూ పట్టించుకోకున్నా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయం పాటించారన్నారు. పాస్లు ఉన్నా.. లేకున్నా స్వామివారి కల్యాణోత్సవం విజయవంతం చేసేందుకు తమ పార్టీ శ్రేణులు సహకరించారని తెలిపారు. ఆలయ వద్ద సరైన ఏర్పాట్లు కల్పిం చకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
కొమురవెల్లి మల్లన్న మా కుల దైవమని, తాను చిన్ననాటి నుంచి కొమురవెల్లికి వస్తున్నానని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. నేను హ్యాట్రిక్ మల్లారెడ్డినని, తనతో పాటు తమ కుటుంబంలో మూడు తరాలుగా కొమురవెల్లి మల్లన్న పేరు పెట్టుకున్నామన్నారు. పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. ఏ వ్యాపారం చేసిన మల్లన్న దీవెనలతోనే సక్సెస్ అయ్యానని చెప్పారు.
చేర్యాల, జనవరి 7: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ఆలయ వర్గాలు లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించనున్నారు. కల్యాణం మరుసటి రోజు లక్ష బిల్వార్చన పూజలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీ. అనువంశిక వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం స్వామివారి ఆలయంలో స్వస్తిక్ పుణ్యవచనం, గణపతి పూజ, పంచచార్య పూజలు, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, మహా నైవేద్యం తదితర పూజలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా లక్ష బిల్వాలను(మారేడు) స్వామి మూలవిరాట్ వద్ద సమర్పిస్తూ 1008 పర్యాయాలు మల్లన్న నామస్మరణలను పటిస్తూ బిల్వార్చన పూజలు చేస్తారు.