నర్సాపూర్, మార్చి 25 : అనేక వ్యాధులను నిర్మూలించే వ్యాక్సిన్ల తయారీలో ఫార్మాసిస్టులు కీలక పాత్ర వహిస్తున్నారని డ్రగ్స్ కంట్రోలర్, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రెగులేటరీ డైరెక్టర్ మారెపల్లి అమృత్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణ శివారులోని విష్ణు ఫార్మసీ కళాశాలలో శనివారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డ్రగ్స్ కంట్రోలర్ అమృత్, గ్లోబల్ ఆస్పటల్ గ్రూప్ ఇండియా హెడ్ డాక్టర్ దినేశ్ ఎల్లమెల్లి, విష్ణు విద్యాసంస్థల చైర్మన్ కేవీ విష్ణురాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రెగులేటరీ డైరెక్టర్ అమృత్ మాట్లాడుతూ లక్ష్య సాధనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి సాధించాలని విద్యార్థులకు సూచించారు. మిగ తా రంగాల కంటే ఫార్మసీ తొందరగా అభివృద్ధ్ది చెందుతుందని, ఇందులో హైదరాబాద్ ముందుందన్నారు. అవకాశాలు సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని గ్లోబల్ ఆస్పటల్ గ్రూప్ ఇండియా హెడ్ డాక్టర్ దినేశ్ సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో వైపర్ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు.