అమీన్పూర్(జిన్నారం), ఫిబ్రవరి 14 : చెత్తను తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. రెండు నెలలుగా చెత్తను రాంకీకి తరలించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. తరుచూ చెత్తను కాల్చివేస్తుండటంతో దట్టమైన పొగలు వ్యాపించి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెత్త సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సమీపంలోని చాలాకాలనీల ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పరిధిలో సుమారు 3 లక్షల వరకు జనాభా ఉంటుంది. వంద వరకు కాలనీలు ఉన్నాయి. దీంతో నిత్యం అధికారులు 150టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. అమీన్పూర్ శివారులోని 993 సర్వేనంబర్లోని భూమిలో చెత్త వేస్తూ ఇక్కడి నుంచి రాంకీ వేస్ట్మేనేజ్మెంట్ ప్లాంటుకు తరలిస్తుంటారు.
గత ఏడాది అక్టోబర్ వరకు రాంకీతో చెత్తను తరలించే అగ్రిమెంట్ పూర్తయ్యింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో డిసెంబర్ 3 వరకు చెత్తను రాంకీకి తరలించారు. డిసెంబర్3 తర్వాత అమీన్పూర్ జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో రాంకీ ఒప్పంది ముగిసింది. అప్పటి నుంచి నేటి వరకు చెత్త తరలించే ప్రక్రియ ఆగిపోయింది.సుమారు వెయ్యి టన్నుల చెత్త పేరుకుపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను కాల్చివేస్తుండటంతో భారీగా వాసనలు, దట్టమైన పొగలు వెలువడుతున్నాయి.
దీంతో సమీపంలోని సుమారు పది కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను డంపింగ్ చేస్తున్న స్థలంలోనే క్టిస్టియన్ల కోసం ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక కూడా ఉంది. దీన్ని వినియోగించుకోవటం కూడా ఇబ్బందిగా మారింది. నెల రోజుల నుంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సమస్య పరిష్కరించాలని స్థానిక కాలనీ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం దక్కలేదు.
చెత్త తరలింపు ప్రక్రియను ప్రారంభించాం
రాంకీ సంస్థతో ఒప్పందం అయిపోవటంతో సమస్య ఏర్పడింది. ఉన్నతాధికారులతో మాట్లాడి రాంకీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు చెత్తను తరలిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది. చెత్తను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేస్తుండటం తో పొగలు వెలువడుతున్నాయి. చెత్త సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాం.
-ప్రదీప్కుమార్, డిప్యూటీ కమిషనర్ అమీన్పూర్, సంగారెడ్డి జిల్లా
డంపింగ్యార్డును తరలించాలి
నెల రోజుల నుంచి దట్టమైన పొగలు, దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఈ సమస్య పరిష్కరించాలని అధికారులకు చాలాసార్లు విన్నవించాం. డంపింగ్యార్డును ఇక్కడి నుంచి తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తాం.
– తిరుమల్రెడ్డి, పీపుల్స్ అసోసియేషన్ చైర్మన్, అమీన్పూర్, సంగారెడ్డి జిల్లా