పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 21 : మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గురుపాదగుట్టపై ఉన్న శివాలయం కొంత కాలంగా నిరాదరణకు గురైంది. ప్రస్తుతం పూర్వవైభవం రానుండడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలనాడు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఈ ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండాపోయింది. మండల కేంద్రానికి చెందిన ఆలయ ధర్మకర్త బలరాం సంగమేశ్వర్ ముందుకువచ్చి 35 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నాడు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటి వరకు శిథిలావస్థలో ఉంది. 35 ఏళ్ల క్రితం ఇక్కడి శివాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జాతర, బండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగాయి. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకున్నది. ఆలయం, పక్కనే ఉన్న మండపం, ఆంజనేయ ఆలయం, నూతనంగా నిర్మిస్తున్న నాగేంద్రుడు, నవగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ఠించనున్నారు.
ఆలయ చరిత్ర..
పూర్వీకుల కథనం ప్రకారం.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న జంగమయ్యకు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. పెద్దశంకరంపేట మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో జంగమయ్య తపస్సు చేయాలనుకున్నాడు. ఈ అటవీ ప్రాంతంలోనే చెరువు ఉండటంతో ప్రతిరోజు స్నానమాచరించి గుట్టపై తపస్సు చేశాడు. ఓ షావుకారు ఒక శివాలయాన్ని, ధ్యానం కోసం ఓ మండపాన్ని నిర్మించారు. అలా శివాలయం నిర్మితమవుతున్న సమయంలో జంగమయ్య (గురుపాదప్ప) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉన్న తన బంధువర్గాన్ని ఆలయ నిర్మా ణం విషయం తెలిసి పిలుపించుకున్నారు.
శివార్చన కోసం నిరుపేద జంగమయ్యను పూజారిగా నియమించి ధూపదీప నైవేద్యం కోసం కొంత డబ్బు కేటాయించారు. గురుపాదప్ప ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆలయ నిర్వహణ బాధ్యతను ఆయన కుమారుడు హిమగిరి మహరాజ్కు అప్పగించి ఆయన అక్కడే జీవ సమాధి అయ్యా రు. ఈ సమయంలో పెద్దశంకరంపేటను పాలిస్తున్న రాణిశంకరమ్మ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి నుం చి పట్టణంలో ఉన్న రాణి శంకరమ్మ గడికోటకు సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నది. పేరుగాంచిన గురుపాదప్ప ఆలయంలో ప్రతి మహాశివరాత్రికి ఉత్సవాలు, తిరునాళ్లు, జాతర నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ ఆలయం రానురాను మరుగున పడటంతో పట్టించుకునేవారు కరువయ్యారు.
నేడు పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం..
ఈ నెల 22న పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, బండ్ల ఊరేగింపు, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కట్ట మైసమ్మ గురుపాదగుట్ట ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఆలయం పునరుద్ధరణ కావడంతో ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్వవైభవం..
సుమారు 35 సంవత్సరాల క్రితం మరుగున పడ్డ జాతర, బండ్ల ఉత్సవాలు ఈ సంవత్సరం నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ముందుకువచ్చారు. ఆధ్యాత్మిక నిలయమైన గురుపాదగుట్ట ఆలయంతోపాటు కట్టమైసమ్మ ఆలయం ఉండడంతో ప్రజలు ఆదివారం విందు భోజనాలు ఎక్కువ సంఖ్యలో చేసుకుంటారు. ఈ ప్రాంతంలో ప్రజల కొంగు బంగారమైన కట్టమైసమ్మ తల్లి కొలువై ఉండటంతో పట్టణ ప్రజలు, శుక్ర, ఆది, మంగళవారం విందు భోజనాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఆదివారం వందలాది మంది దూర ప్రాంతాల నుంచి మొక్కలు చెల్లించుకుంటున్నారు.
ఆలయానికి దారి..
పెద్దశంకరంపేట నుంచి రేగోడ్ వెళ్లే రహదారిలో మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో గురుపాదగుట్ట కమాన్ వద్ద దిగి పర్లాంగ్ నడుచుకుంటూ వెళ్లాలి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ను స్థానికులు చాలా ఏళ్లుగా చేస్తున్నారు.