రామచంద్రాపురం/పటాన్చెరు టౌన్, డిసెంబర్2: పటాన్చెరు 113 డివిజన్ పరిధిలోని బండ్లగూడ గ్రామంలో ఉన్న దోషం చెరువును కొందరు కబ్జా చేసేందుకకు ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా రాత్రి పూట లారీల్లో మట్టి తెచ్చి నింపుతున్నారు. కబ్జా చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులో మట్టి నింపుతున్నట్లు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన దోషం చెరువును పరిశీలించి కంగుతిన్నారు. సుమారుగా రెండు ఎకరాల వరకు కబ్జా దారులు మట్టిని నింపారు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాగైనా చెరువులో మట్టి నింపుతున్న వారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో రాత్రి వేళ చెరువు వద్ద తన మనుషులను కాపలా పెట్టారు.
శుక్రవారం తెల్లవారుజామున చెరువులో మట్టి నింపుతున్న లారీని పట్టుకుని కార్పొరేటర్కు సమాచారం అందించారు. దీంతో అయన చెరువు వద్దకు వచ్చి ఇరిగేషన్ డీఈ నళిని, జేఈ పావని, ఆర్సీపురం తహసీల్దార్ జయరాం, ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి లారీని, దుండగులను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. లారీని సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చెరువులో మట్టి నింపుతున్న అసలు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదన్నారు. కొద్ది రోజులుగా దోషం చెరువులో మట్టి నింపుతున్నారన్నా సమాచాం తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టామన్నారు. చెరువులో మట్టి నింపుతున్న లారీని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అధికారులు స్పందించి చెరువును రక్షించాలని కోరారు.