పాపన్నపేట, ఆగస్టు10 : ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో పాపన్నపేట గ్రామ పంచాయతీ ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా పాపన్న మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల కృష్ణ (40) పాపన్నపేట పంచాయతీ కార్యాలయంలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం తన ద్విచక్రవాహనం పై బంధువైన వెంకట్ తో కలిసి కొత్తపల్లి వైపు నుంచి పాపన్నపేట వైపు వెళుతున్నాడు.
ఇదే క్రమంలో వైపు ముస్లాపూర్ వైపు నుండి వస్తున్న బైక్ యూసుఫ్ పేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా ఢీ కొనడంతో కృష్ణ రోడ్డుపై పడ్డారు. దీంతో అతడికి తలకు తీవ్ర గాయాలు అయ్యి తీవ్ర రక్త స్రావం అయింది. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే 108, పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షత్తగాత్రులను మెదక్ ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కృష్ణ మృతి చెందినట్లు పరీక్షించిన డాక్టర్లు నిర్ధారించారు. కాగా మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఈ సంఘటనతో పాపన్నపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.