న్యాల్కల్, మే 4: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవాపూర్-హుమ్నాపూర్ గ్రామ శివారులోని సిద్ది సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా వేడుక తుది ఘట్టానికి చేరుకుంది. కుంభమేళా శుక్రవారంతో ముగియనున్నది. దీంతో గురువారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో నదీతీరం భక్తజన సంద్రంగా మారింది. పంచవటీ క్షేత్రంలోని సిద్ది సరస్వతీ దేవి, షిర్డీ సాయిబాబా, వేంకటేశ్వర స్వామి, సూర్యభగవాన్, గంగామాత ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య కుంకుమార్చన, అభిషేకం, పార్ధీవ లింగార్చన, రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలు కొనసాగాయి.
ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాగ, దిగంబర సాధువులు, స్వామీజీలు బాజాభజంత్రీల హోరు మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా నదికి తరలివెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగామాత ఆలయ సమీపంలోని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ప్రధాన పూజారి అయ్యప్పస్వామి వైదిక పురోహితులు నదిలో పూజలు నిర్వహించి మహా గంగా హారతి సమర్పించారు. మల్గి నవనాథ్ సిద్ధ లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి జగదీశ్వరి మాతాజీ హాజరై భక్తులకు ప్రవచనాలు బోధించారు. పలువురు దాతలు భక్తులకు అన్నదానం చేశారు.
నేడు కాశీ పీఠాధిపతి డాక్టర్ చంద్రశేఖర శివాచార్య రాక
కుంభమేళా ముగింపు ఉత్సవాలకు కాశీ పీఠాధిపతి 1008 డాక్టర్ చంద్రశేఖర శివాచార్య, జ్ఞాన సింహాసనాధీశుడు, జగద్గురు, ముక్కల్కోట్ పీఠాధిపతి మృగరాజేంద్ర, రాఘవాచారి ఆశ్రమ పీఠాధిపతి పండరి మహరాజ్, బిచ్కుంద సంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివాచార్య మహా స్వామిజీ తదితరులు హాజరుకానున్నారు. ముగింపు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కాశీనాథ్బాబా కోరారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
కుంభమేళాకు ఆయా ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జహీరాబాద్, సంగారెడ్డి డీఎల్పీవో రాఘవరావు, సతీశ్రెడ్డి, స్థానిక తహసీల్దార్ ఆంటోనీ, ఎంపీడీవో వెంకట్రెడ్డి తదితరులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపారు. పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు, పోలీసులు, వలంటీర్ల సేవలు కొనసాగాయి. జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్సై వినయ్కుమార్ ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.