రెండో రోజూ వేడుకలా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
పిచ్చిమొక్కల ఏరివేత, మురికి కాల్వలు శుభ్రం
వాడవాడల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
స్థానికులతో సమస్యలపై ఆరా..
పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యేలు, జడ్పీచైర్పర్సన్లు, కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు
‘ప్రగతి’లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రారంభించి, జోరుగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రత, స్వచ్ఛతకు పూనుకున్నారు. ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. ప్రగతిలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాల్వలు శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రంగా చేయడం, ఎవెన్యూ ప్లాంటేషన్, వన నర్సరీ, డంపింగ్యార్డుల్లో పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులంతా కలిసి సమన్వయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యాక్రమాలను విజయవంతం చేస్తున్నారు.
సంగారెడ్డి/ మెదక్ నెట్వర్క్, జూన్ 4 : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండో రోజూ జోరుగా నిర్వహించారు. శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు గల్లీ గల్లీలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. పలుచోట్ల జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మెదక్ కలెక్టర్ హరీశ్ నర్సాపూర్లో వైకుంఠధామం నిర్మాణాన్ని, కొల్చారంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించగా, శివ్వంపేటలో జడ్పీచైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, సర్పంచ్ బోళ్ల భారతి భిక్షపతి పల్లె ప్రగతిని ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వట్పల్లి మండలం నాగులపల్లి, సాయిపేటలో, పుల్కల్ పరిధి గొంగ్లూర్, గంగోజిపేటల్లో పర్యటించి పనులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీవో యూసూఫ్, తోటమాలిని సన్మానించారు. అందోల్ మండలంలో జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీజైపాల్ రెడ్డి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కొండాపూర్ హనుమాన్ తండాలో రోడ్లు ఊడ్చారు. మొగుడంపల్లిలో జడ్పీ సీఈవో ఎల్లయ్య పర్యటించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు.
శనివారం నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ తండాలో నిర్వహించిన పల్లె ప్రగతిలో పాల్గొని రోడ్డు ఊడుస్తున్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
జిన్నారం: లక్ష్మీపతి గూడెంలో రోడ్డును శుభ్రం చేస్తున్న మహిళలు
మెదక్ మున్సిపాలిటీ: 5వార్డులో జేసీబీ సహాయంతో చెత్త తొలగింపు