ఆవిష్కరణలుసంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 21: తమ కోర్సులో భాగంగా నేర్చుకున్న అంశాలను ప్రదర్శించి ప్రతిభను చాటేందుకు సృజన టెక్ఫెస్ట్ వేదికైంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు గురువారం మండల పరిధిలోని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సృజన టెక్ఫెస్ట్ నిర్వహించారు. ఈ పోటీల్లో జోగిపేట, నారాయణఖేడ్, గజ్వేల్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సృజన టెక్ఫెస్ట్ పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న పరిజ్ఞానాన్ని వెలికితీసేందుకే ఉపయోగపడతాయన్నారు. ఈ పోటీల్లో జోగిపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతి పొందగా, గజ్వేల్ జీఎంఆర్పీ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఈసీఈ కోఆర్డినేటర్ జి.మల్లికార్జున్, బీఎస్ఎన్ఎల్ ఏజీఎం వసంత, శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగధిపతి డాక్టర్ జగదీశ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.