హుస్నాబాద్, జూన్ 23 : ప్రభుత్వ కళాశాలల ను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిఫ్కోర్టు జడ్జి శివరంజనీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలతోపాటు డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. ఆయా కళాశాలల ఆవరణలు, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు కళాశాలలను సందర్శించినట్లు తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తున్నదని, ఇది సరైన పద్ధతి కాదన్నారు.
ఇంట్లో మరుగుదొడ్డి నిర్వహణ సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందో తెలియదా..? కళాశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ సరిగ్గా లేకుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్, ఇన్చార్జి ప్రిన్సిపాళ్లను ప్రశ్నించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కళాశాలల్లో మరుగుదొడ్లను నిర్మించిందని, వాటి ని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉందన్నారు. వారం రోజుల్లో మళ్లీ వస్తానని, మరుగుదొడ్లు ఇలాగే ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆమె వెంట కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, కోర్టు సిబ్బంది ఉన్నారు.