సిద్దిపేట, జనవరి 5 : స్వచ్ఛ సర్వేక్షణ్లో సిద్దిపేట మెరిసింది. సిద్దిపేట అంటేనే అవార్డులు అని మరోసారి నిరూపించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛ తకు మారుపేరుగా నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీ పేరు లేకుండా అవార్డులు లేవు అనేది ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పిన మాటను మారోసారి నిరూపించింది. రాష్ట్రంలోనే అనేక మున్సిపాలిటీలకు చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను వేరుచేయడం, చెత్త నుంచి సంపద సృష్టించడం.. చెత్తను ఒక ఆదాయ వనరుగా మార్చే స్వచ్ఛ బడిలాంటి అనేక ప్రత్యేకతలు కలిగిన సిద్దిపేట మున్సిపాలిటీ మరోసారి జాతీయస్థాయిలో తనసత్తాను చాటింది. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్బ్యాక్లో లక్ష పైచిలుకు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో అగ్రస్థానంలో నిలించింది. ఎమ్మెల్యే హరీశ్రావు పర్యవేక్షణలో చెత్తపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించి చైతన్యం చేయడం ద్వారా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భాగస్వామ్యంతో కూడిన పనితీరుకు ప్రశంసగా నిలిచిందని చెప్పవచ్చు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట అగ్రస్థానంలో నిలిచింది. చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణల్లో సిద్దిపేట చేపట్టిన వినూత్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సిద్దిపేటకు జాతీయస్థాయి అవార్డు రావడం ఎంతో గర్వకారణం. ఈ దిశగా సహకారం అందించిన పట్టణ ప్రజలు, కృషి చేసిన కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.