సాగర తీరాన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం
సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణకే తలమానికం
ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిర్మాణం
నందికొండ, మే 14 : నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నది. సిద్ధార్థుడిగా మొదలైన అడుగుల నుంచి బుద్ధుడిగా నిర్యాణం చెందే వరకూ కీలక ఘట్టాలను కండ్లకు కడుతూ.. అష్టాంగ మార్గాలను బోధించేలా రూపుదిద్దుకున్న ఈ అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం శనివారం అందుబాటులోకి వచ్చింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మక బద్ధవనాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా సీఎం కేసీఆర్ సంకల్పంతో 247 ఎకరాల్లో అత్యద్భుతంగా రూపుదిద్దుకుని, తెలంగాణకే మణిహారంగా నిలుస్తున్న బుద్ధవనం విశేషాల సమాహారం ఈ ప్రత్యేక కథనం..
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్కాలనీలో 2003 సంవత్సరంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.42 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించాయి. 2014 వరకు నిధుల కొరతతో పనులు అంతంత మాత్రంగానే నడిచాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో బుద్ధవనానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా 2015లో రూ.25కోట్లు మంజూరు చేశారు. దాంతో పనులు ముందుకు సాగాయి. మరో 35 కోట్ల రూపాయలతో మిగతా పనులు చేపట్టాల్సింది. శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఇతర మంత్రులు మహమూద్ అలీ శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా తో కలిసి బుద్ధవనాన్ని ప్రారంభించారు.
బుద్ధచరిత వనం..
గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన ఐదు ఘట్టాలు ఇందులో ఉన్నాయి. బుద్ధుడి జననం, మహా నిష్క్రమణ, తపస్సు చేయడం, ఉపన్యాసం, మరణం వంటి ఘట్టాలను కంచు లోహాలతో పొందుపరిచారు. బుద్ధుడు అహింసా మార్గాన్ని ఎంచుకున్న ఘట్టాలు, అడవులకు పోయిన సన్నివేశాలు, బోధి వృక్షం కింద జ్ఞానం పొందిన అంశాలకు సంబంధించిన శిల్పాలను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. బుద్ధ చరిత వనంలో బుద్ధుడి పాదాల నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
స్థూప పార్కు..
భారతదేశంలోని సాంచీ, సారనాథ్, అజంతా, అమరావతి, కారలే, మాణిక్యాల 5 రకాల స్థూపాల నమూనాలు, వివిధ దేశాల్లోని మీర్పూర్ఖాస్ (పాకిస్తాన్), అనురాధపుర (శ్రీలంక), పగోడ (చైనా), చోర్టన్ (టిబెట్), బౌద్ధనాథ్ (నేపాల్) తదితర 8 బౌద్ధ స్థూపాల నమూనాలతో మొత్తం 13 స్థూపాలను ఈ పార్కులో పొందుపరిచారు. ప్రపంచంలో ఉన్న బౌద్ధులు ఒకే చోట స్థూప నమూనాలు చూసే విధంగా ఈ పార్కును నిర్మించారు.
అహింసాయుతమైన అష్టాంగ మార్గాలు
గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అహింసాయుతమైన అష్టాంగ మార్గాలను బుద్ధవనంలో పొందుపరుస్తూ బౌద్ధ భిక్షువులను, పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు చేపట్టారు. 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించగా, అందులో 35 ఎకరాలను విపాసన ధ్యాన కేంద్రానికి కేటాయించారు. బుద్ధుడు అనుసరించిన అష్టాంగ మార్గాలను బోధించే వివరించేలా బుద్ధ చరిత్ర వనం, జాతక పార్కు, ధ్యాన వనం, స్థూప పార్కు, మహాస్థూపం పనులు పూర్తయ్యాయి. ముఖ ద్వారాన్ని అశోక చక్రం, ఏనుగులతో అద్భుతంగా నిర్మించారు. ఆచార్య నాగార్జున రిసెర్చ్ సెంటర్, కృష్ణావ్యాలీ పార్కు, బుద్ధిజం తెలంగాణ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని బౌద్ధమత స్థూపాల నమూనాలను ఒకే చోట చూపడం బుద్ధవనం ప్రత్యేకత. ఇక్కడ బౌద్ధ శిల్పాలు, స్థూపాలు, మ్యూజియ్యాన్ని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
పర్యాటకులకు సకల వసతులు..
బుద్ధవనానికి వచ్చే బౌద్ధ భిక్షువులు, పర్యాటకుల కోసం హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు, పిల్లల కోసం స్నాక్ బార్, మినీ ట్రైన్ను అందుబాటులోకి తేనున్నారు. పర్యాటకులకు వివరించేందుకు గైడ్లను ఏర్పాటు చేస్తున్నారు. నాగార్జునసాగర్కు వచ్చే టూరిస్ట్లు బుద్ధవనం, నాగార్జునకొండ, చాకలిగట్టు, నెల్లికల్ అర్బన్ పార్కులను ఒకే ప్యాకేజీలో చూపించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఆయక స్తంభాలు
బుద్ధుడి జీవితంలోని ముఖ్యమైన 5 సంఘటనలను వివరించేలా మహాస్తూపానికి నాలుగు వైపులా ఐదేసి చొప్పున స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటిని ఆయక స్తంభాలు అంటారు.
1) సిద్ధార్థుడి జననం : లుంబినీ వనంలో మాయాదేవికి సిద్ధార్థుడు జన్మించడం
2) మహాభినిష్క్రమనం : నాలుగు విషాదకరమైన సంఘటనలు చూసిన తర్వాత సిద్ధార్థుడు భార్యాపిల్లలు, నగరాన్ని వదిలి తపస్సు కోసం అడవికి వెళ్లడం.
3) జ్ఞానోదయం : గయలో సిద్ధార్థుడు తపస్సు అనంతరం బుద్ధుడిగా మారడం
4) ధర్మచక్ర పరివర్తన : సారనాథ్లోని మృగధావనంలో బుద్ధుడి మొదటి ఉపన్యాసం
5) మహాపరినిర్యాణం : 80వ ఏట బుద్ధుడి నిర్యాణం.
మహా స్తూపం..
బుద్ధవనంలో నిర్మించిన మహాస్థూపం దక్షిణ భారత దేశంలో అతిపెద్దది. 42 మీటర్ల వ్యాసం, 21 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మించారు. రెండు వేల సంవత్సరాల క్రితం శాతవాహన కాలంలో అమరావతిలో నిర్మించిన మహాస్థూపానికి సంబంధించిన కొలతలను ప్రమాణికంగా తీసుకున్నారు. మహాస్థూప నిర్మాణంలో అష్టాంగ మార్గానికి గుర్తుగా 8 భాగాలను ఏర్పాటు చేశారు. ఇందులో మ్యూజియం, ఆడిటోరియం, లైబ్రరీ ఉన్నాయి. ఆసియాలోనే అతి పెద్ద కాంక్రీట్ స్థూపం నిర్మాణానికి 128 మంది కళాకారులు పని చేశారు.
జాతక పార్కు..
బుద్ధుడికి సంబంధించి 547 జాతక కథలు ప్రపంచంలో వాడుకలో ఉన్నాయి. అందులో ప్రముఖమైన 42 కథలను సేకరించి, వాటిని వివరించే విధంగా శిల్పాల రూపంలో ఈ పార్కులో పొందుపరిచారు. అందుకు అవసరమైన ఆకుపచ్చ వర్ణ సున్నపురాయిని కృష్ణపట్టెలోని వాడపల్లి, సత్తెనపల్లి సమీపంలోని కాట్రపాడు, మద్దిపాడు క్వారీల నుంచి తీసుకున్నారు.
మహా నిష్క్రమణ
గుర్రం దాని వెనుక ఉన్న ఈ చిత్రం సిద్ధార్థుడు పెరిగి పెద్దవాడై వీధిలోకి వచ్చినప్పుడు కనిపించే విషాధ ఘటనలకు అద్దం పడుతుంది. అందుకు అనుగుణంగా ఇంటి వీధి గుమ్మం, దాని ముందు గుర్రం ఏర్పాటు చేశారు.
ఆ నలుగురు..
సిద్ధార్థుడు బాహ్య ప్రపంచంలో చూసి చలించిన ముసలి వ్యక్తి, రోగి, అంతిమ యాత్రగా వెళ్తున్న వ్యక్తి మృతదేహం, సాధువు శిల్పాలను ఇక్కడ ఏర్పాటుచేశారు. పుట్టిన ప్రతి జీవికీ వృద్ధాప్యం, ఆరోగ్యం క్షీణించడం, మరణం తప్పదని తన రధసారథి చెన్నుడు ద్వారా సిద్ధార్థుడు తెలుసుకుంటాడు. చివరగా మానవ సంబంధాలను త్యజించిన సాధువు మొహంలోని తేజస్సును చూసి జీవితంలో సత్యం, నిజమైన జ్ఞానం తెలుసుకోవాలని భావించి ఆ దిశగా తప్పస్సుకు నిర్ణయించుకుంటాడు.
బుద్ధుడి జననం
మహావృక్షం కింద మహిళ, ఆమె ముందు బాలుడు ఉన్న శిల్పం సిద్ధార్థుడి జననం గురించి తెలుపుతున్నది. సిద్ధార్థుడు మాయాదేవికి లుంబినీ వనంలో సాల వృక్షం కింద జన్మించాడని చెప్పడమే దీని ఉద్దేశం. పైకి వేలు చూపుతున్న బాలుడే సిద్ధార్థుడు అని, ఆకాశం వైపు వేలు చూపించడానికి అర్థం.. సిద్ధార్థుడు పుట్టుకతోనే ఏడు అడుగులు వేస్తాడని, ప్రతి అడుగుకూ ఒక పద్మం వికసిస్తుందని చరిత్రకారులు చెప్తున్నారు.
అవకాన బుద్ధ
శ్రీలంక, తెలుగు ప్రజల మధ్యనున్న రెండు వేల సంవత్సరాల అనుబంధానికి ప్రతీకగా అప్పటి శ్రీలంక ప్రభుత్వం నాగార్జునకొండలో సింహళ విహారం నిర్మించింది. అందుకు కొనసాగింపుగా బుద్ధవనంలో 27 అడుగుల ఎత్తైన ఈ బుద్ధ విగ్రహంతోపాటు దమ్మగంటను శ్రీలంక సర్కారు ఇక్కడ ఏర్పాటు చేసింది.