శాసనసభ ఎన్నికల మహా సంగ్రామం గురువారం ముగిసింది. జిల్లాలో అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపులు, చిన్నచిన్న
ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరగా వారందరికీ రాత్రి వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు తన కుటుంబ సభ్యులలో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర ప్రముఖులు వారి స్వగ్రామాల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈనెల 3న ఓట్లను లెక్కించనున్నారు.ఉదయం నుంచే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్చైర్లు, వాహనాలు ఏర్పాటు చేయడంతో వారంతా ఓటు హక్కును వినియో
గించుకున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
నమస్తే నెట్వర్క్, నవంబర్ 30 : నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటల నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 5గంటల వరకే సమయం దాటినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాల్లో బారులు తీరారు. రాఘవాపూర్, తోర్నాల, ఇర్కోడులోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6:30 వరకు ఓటు వేసేందుకు క్యూలో ఉన్నారు. రాఘవాపూర్లో గుడికందుల మల్లయ్య పక్షవాతంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్వీ గ్రామశాఖ అధ్యక్షుడు గ్యార సురేశ్ చొరవతో మల్లయ్యను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేయించారు. రాఘవాపూర్లో గ్యార వెంకవ్వ (90) అనారోగ్యంతో బాధపడుతుండగా బూత్ ఇన్చార్జి గ్యార బాల్రాజ్ సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. చంద్లాపూర్లో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రాధాకృష్ణశర్మ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
సిద్దిపేట, నవంబర్ 30 : నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయం త్రం 5గంటలకు 73.03శాతం పోలింగ్ నమోదైంది. గంటల వారీగా చూస్తే ఉదయం 7 నుంచి 9 వరకు సిద్దిపేటలో 11.31శాతం, 11 వరకు 30.0 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటల వరకు 44.85శాతం, మధ్యాహ్నం 3 వరకు 64.52 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 వరకు 73.03 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో యువకుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సిద్దిపేట శివారు పొన్నాలలోని ఇం దూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు.
సిద్దిపేట అర్బన్, నవంబర్ 30 : జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు సీపీ శ్వేత తెలిపారు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడానికి బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. ప్రశాంతంగా పోలింగ్ ముగిసేందుకు సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఈవీఎం, వీవీ ప్యాట్లను పట్టణంలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.