అందోల్, ఫిబ్రవరి 3 : అందోల్ నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాల్లో ముందుంచడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం అందోల్లోని పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి తనిఖీ చేశారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాలతో పాటు 150 పడకల దవాఖాన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని సమకూర్చాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడిన మంత్రి.. సిబ్బంది, విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
కళాశాలలో ప్రహరీ నిర్మాణం, వర్క్షాపు షెడ్డుతో పాటు ఇతర అవసరాలున్నట్లు గుర్తించి నిధులు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసం నూతనంగా 150 పడకల దవాఖాన నిర్మిస్తున్నామని, నర్సింగ్ కళాశాల ఏర్పాటుచేసి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రానున్న రోజుల్లో అందోల్ నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు సురేందర్గౌడ్, చిట్టిబాబు, ప్రవీణ్, నాయకులు ప్రదీప్గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వినయ్గౌడ్ పాల్గొన్నారు.
రేగోడ్, ఫిబ్రవరి 3 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని వైద్య,ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండలంలోని లింగంపల్లి, పోచారం, మర్పల్లి, రేగోడ్, జగిర్యాల, ఆర్ఇటిక్యాల గ్రామాల్లో రూ. కోటి డబ్భు ఐదు లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని దళిత వాడల్లో పర్యటించి సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు, విద్యుత్ స్తంభాలు, మురుగు కాల్వల సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మండల కేంద్రంలోని దళితవాడలో నివసిస్తున్న రమేశ్ తన భార్య చనిపోయిందని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంత్రిని కోరడంతో ఇద్దరు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్, కళాశాలల్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు చదువు ఆయుధమని, చదువు వల్ల మనోధైర్యం, ప్రశ్నించే గుణం అలవడుతుందన్నారు. మాతృభాషలో మాట్లాడుతూనే ఇతర భాషలను గౌరవించాలన్నారు. కస్తూర్బా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.85 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈవో రాధాకిషన్, ఆర్డీవో అంబదాస్, తహసీల్దార్ బాలలక్ష్మి, జడ్పీటీసీ యాదగిరి, రాయికోడ్ పీసీసీ కిషన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దిగంబర్ రావు, సీనియర్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.