ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. జిల్లాల పునర్విభజనలో ప్రతి జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం చేరిందన్నారు. నీతిఆయోగ్ నివేదికలో ప్రసవాల పురోగతిలో తెలంగాణ టాప్లో ఉందన్నారు. 81శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయన్నారు. మాతృ, శిశు మరణాలు తగ్గాయన్నారు. గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య మహిళా పథకంలో 57 రకాల పరీక్షలు చేస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలకు క్యూకట్టారని చెప్పారు.
– సంగారెడ్డి, మెదక్ నెట్వర్క్, జూన్ 14
మెదక్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వైద్య రంగానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, సి బ్బంది సేవలు వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక మాయా గార్డెన్లో వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ప్రారంభించి, 20 మంది గర్భిణులకు అందజేశారు. క్షేత్ర స్థాయిలో రోగుల బీపీని ఏఎన్ఎంలు పరీక్షించేందుకు డిజిటల్ బీపీ మిషన్లు అందజేశారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు. వైద్యారోగ్య శాఖ సాధించిన ప్రగతిపై కరపత్రాన్ని డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ ఆధ్వర్యంలో ఆవిషరించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణుల్లో అనీమియా తగ్గించుటకు, ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనిచ్చేందుకు విటమిన్లతో కూడిన న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నామన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్లో తెలంగాణ ఓవరాల్ ర్యాంకింగ్లో 3వ స్థానం, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్లో ఉందన్నారు. సీఎం కేసీఆర్ 33 జిల్లాలకు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేశారన్నారు. ఇప్పటి వరకు 21 జిల్లాల్లో ఈ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. మన జిల్లా లో త్వరలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసుకోనున్నట్లు తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఒకే రోజు 25 ప్రసవాలు నిర్వహించి రికార్డు నెలకొల్పారన్నారు.
దేశానికి రోల్ మాడల్ తెలంగాణ: కలెక్టర్ రాజర్షి షా
కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయడంతో నేడు తెలంగాణ దేశానికి రోల్ మాడల్గా నిలిచిందన్నారు. ఖమ్మం లో కంటి వెలుగులో పాల్గొన్న పంజాబ్, ఢిల్లీ సీఎంలు కూడా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తానడం హర్షించదగ్గ విషమయాన్నారు. నీతి ఆయోగ్ కూడా మన కార్యక్రమాలను ప్రశంసిస్తున్నాదన్నారు. జిల్లాల్లో డయాలసిస్ కేంద్రం, ఐసీయూ యూనిట్ ప్రారంభించుకోవడంతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. కంటి వెలుగులో 4.70 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారన్నారు. అనంతరం బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన నలుగురు ఆయు ష్ డాక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలందించిన వైద్యులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు ప్రశంసా పత్రంతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య రెడ్డి, ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాళ్, చంద్రశేఖర్, నవీన్, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, జూన్14: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగం గా జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి ఆధ్వర్యంలో వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, గర్భిణులకు షీల్డులు, చీర లు, న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. 2014కు ముందు సర్కారు దవాఖాన అంటే నేను రాను బిడ్డో అనేవారని, నేడు బారు లు దీరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మార్పులేనని, దీంతో ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతున్నదని అన్నారు. కరోనా కాలంలో అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, వైద్యులు, బాధితులకు అండగా నిలిచి, సేవలందించారన్నారు.
వైద్య రంగ అభివృద్ధికి రూ.702 కోట్లు: కలెక్టర్ శరత్
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ప్రజలపై పడలేదని కలెక్టర్ శరత్ గుర్తుచేశారు. జిల్లా వైద్య రంగం అభివృద్ధికి రూ.702 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. జిల్లాలోని దవాఖానల్లో బెడ్లు పెంచి బాధితులకు వైద్య సేవలు అందస్తున్నామన్నారు. సాధారణ ప్రసవాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్లు అందించి, గర్భిణులు సంతోషంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపుతున్నారన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ బిడ్డకు రూ.12 వేల నగదు అందజేస్తున్నట్లు తెలిపారు. కంటివెలుగు తొలి విడతలో జిల్లాలో 1.90 లక్షల మందికి, రెండో విడతలో 1.32 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలకు రూ.510 కోట్ల నిధులు మంజూరు చేసి తొలి దశ పనులు ప్రారంభించుకున్నామన్నారు. రూ.42 కోట్లతో నర్సింగ్ కళాశాలకు పునాదులు పడ్డాయన్నారు. పటాన్చెరులో రూ.75కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన, జహీరాబాద్, నారాయణఖేడ్లలో మెటర్నిటీ, సీఎస్సీ దవాఖానల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, జడ్పీటీసీ కొండల్రెడ్డి, ఎంపీపీ సరళ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్, జూన్ 14: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయని జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్రెడ్డి అన్నా రు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నారాయణఖేడ్లోని రెహమాన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపి, అవసరమైన నిధులు కేటాయించి, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలతో పాటు, ప్రభుత్వ దవాఖానల్లో వసతులు కల్పిస్తున్నారన్నారు.
నాడు సర్కారు దవాఖానలను నాశనం చేశారు
సమైక్య రాష్ట్రంలో సర్కారు దవాఖానల తీరు అధ్వానంగా ఉండేదని, సీఎం కేసీఆర్ పాలన వైద్య రంగానికి స్వర్ణయుగం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. వంద పడకల దవాఖానతోపాటు 50 పడకల మాతా శిశు దవాఖానను, కరస్గుత్తి, కల్హేర్లో 30 పడకల దవాఖానలు నిర్మించారన్నారు. నిజాంపేట్, సిర్గాపూర్ పీహెచ్సీలకు కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 28 కొత్త ఆరోగ్య ఉప కేంద్రాలను నెలకొల్పినట్లు పేర్కొన్నారు. నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో సాధారణ సదుపాయాలతో పాటు ఆక్సిజన్ ప్లాంట్, డయాలసిస్ సెంటర్, రక్తనిధి అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్ మోహన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అలీ, దవాఖాన సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
అభివృద్ధి చూసి బీఆర్ఎస్లో చేరికలు
పెద్దశంకరంపేట, జూన్14: తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని మూసాపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంగ్టిలోనూ 20 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కేశవ్, మల్లేశం, సాయిలు, గోండ్ల లింగం, సతీశ్, సుభాశ్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు సాజిత్, నాయకులు అడివయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ శశింధర్రెడ్డి పాల్గొన్నారు.
వైద్యారోగ్య రంగంలో దేశానికే దిక్సూచి తెలంగాణ
రామచంద్రాపురం, జూన్ 14: వైద్యారోగ్య రంగ అభివృద్ధిలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆర్సీపురం డివిజన్లోని శ్రీ కన్వెన్షన్లో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి వైద్యారోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించిన సంక్షేమ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పరిశీలించారు. అనంతరం 250 మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014కు ముందు, తర్వాత రాష్ట్రంలో జరిగిన మార్పులను ప్రజలు గమనించాలన్నారు. 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందువరుసలో నిలబెట్టారన్నారు. రాష్ర్టాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. తెలంగాణ వాళ్లకు పాలనే రాదని ఎద్దేవా చేసిన వారంద్దరి నోళ్లు మూయించి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తున్నదన్నారు. వైద్యరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. బస్తీ దవాఖానల్లో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఉచిత వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు ప్రశంసా పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, ఎంపీపీలు ప్రవీణ, సుష్మాశ్రీ, ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, కంటి వెలుగు జిల్లా ఇన్చార్జి డాక్టర్ మనోహర్రెడ్డి, నాయకులు నగేశ్, దశరథ్రెడ్డి, అంజయ్య, పరమేశ్, ఐలేశ్, క్రాంతి, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సర్కారు దవాఖానలో కార్పొరేట్ వైద్యం
జహీరాబాద్, జూన్ 14: సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. బుధవారం పస్తాపూర్ గ్రామంలోని ఎస్వీ ఫంక్షన్ హల్లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏరియా దవాఖానలో రూ.కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని వార్డులకు ఆక్సిజన్ అందజేసే ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్ పరిధిలోని వార్డులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో వైద్యం తీసుకొచ్చారన్నారు. న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బి), కోహీర్లో కొత్తగా దవాఖానలు నిర్మిస్తున్నారన్నారు. సర్కారు దవాఖానలో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు కేసీఆర్ కిట్తో పాటు నగదు, గర్భిణులకు న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో ఆర్డీవో వెంకట్రెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి జయదేవు ఆర్య, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, ఇప్పెపల్లి పీఏసీఎస్ చైర్మన్ దాసరి మచ్చేందర్, న్యాల్కల్ ఎంపీపీ అంజమ్మ, జహీరాబాద్ మండల ప్రత్యేక అధికారి వసంతకుమారి, వైద్యలు, సిబ్బంది పాల్గొన్నారు.