జహీరాబాద్, జూలై 5 : ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుంది. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంతో రైతులు వివిధ పంటలు పండిస్తూ లాభాలు పొందుతున్నారు. పండించిన పంటలను రైతులు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లలో అమ్మడంతో మార్కెట్లకు సైతం ఆదాయం సమకూరుతుంది. పంట పంటకు వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెరుగుతున్నది. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్కు 2020-21లో రూ. 1.30కోట్లు రాగా 2021-22 సంవత్సరం మార్చి వరకు మార్కెట్ రూ. 2.19కోట్లకు పెరిగింది. 2022 ఏప్రిల్ నుంచి జూన్ 27వరకు రూ. 39.7లక్షల ఆదాయం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయనికి ప్రాధాన్యత కల్పించడంతో పంటల దిగుబడి పెరిగి మార్కెట్కు కమిషన్ పెరుగుతున్నది.
రైతులకు వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర రావడంతో విక్రయాలు ఎక్కువగా చేస్తుంటారు. వానకాలంలో రైతులు ఎక్కువగా పెసర్లు, మినుములు, సోయా, యాసంగిలో శనగ, కందులు విక్రయిస్తారు. పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్కు 2021-22 గాను రూ.1,03,99,276 కోట్లు డైరెక్ట్గా, ‘అల్లాన’ ఫ్యాక్టరీతో పాటు ఇతర ఫ్యాక్టరీలు ద్వారా రూ. 87,48,790లక్షలు, పశువుల మార్కెట్ ద్వారా రూ. 28,09,690 లక్షలు పండ్ల మార్కెట్ ద్వారా రూ. 32130 ఆదాయం పన్ను రూపంలో వచ్చింది. గతేడాది కంటే రూ. 80వేల ఆదాయం పెరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ 27తేదీ వరకు రూ. 39.7లక్షలు వచ్చింది.
జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆదాయం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పంట ఉత్పత్తులు పెరగడంతో అమ్మకాలు భారీగా పెరిగి ఆదాయం వస్తున్నది. మార్కెట్కు వచ్చే రైతులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. మార్కెట్లో జీరో వ్యాపారం పూర్తి గా నిషేధించడంతో వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు.
– మాన్య అనీల్బాబు, మార్కెట్ కార్యదర్శి, జహీరాబాద్