నారాయణఖేడ్, జూన్29: అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయపర్చుకుని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. బుధవారం నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ మండల అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అనువుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. రోడ్ల పక్కన సుస్వాగతం, ధన్యవాదాలు వంటి బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై ఆరా తీసిన కలెక్టర్ క్రీడా ప్రాంగణాల పనులను నాణ్యమైన రీతిలో చేపట్టడమే కాకుండా ఖోఖో కోర్టును సైతం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల వారీగా క్రీడా ప్రాంగణాల వివరాలను తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి వివరాలను అడిగిన కలెక్టర్ ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల విషయమై చర్చించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నారాయణఖేడ్కు వచ్చిన శరత్ను మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు శాలువా, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, ఏడీఏ కరుణాకర్రెడ్డి, తహసీల్దార్ దశరథ్సింగ్, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి, మండల వ్యవసాయాధికారి శంకర్ తదితరుల పాల్గొన్నారు.